వనపర్తి : వనపర్తి, గద్వాల జిల్లాల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పెబ్బేరులో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలు ఆయా జిల్లాల ఇంఛార్జి మంత్రుల పర్యవేక్షణలో పని చేస్తాయన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది అని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది అని స్పష్టం చేశారు.
ఆందోళనతోనే కరోనా మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా సోకిన వారికి మనోధైర్యానికి మించిన మందు లేదని స్పష్టం చేశారు. మనోధైర్యం కోల్పోతే మనిషిలో యాంటీబాడీస్ ఉత్పత్తి కావడం అగిపోతుంది .. ధైర్యంగా ఉంటే యాంటిబాడీస్ ఉత్పత్తి అవుతాయని మంత్రి పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసుల పాత్ర ప్రముఖమైనది అని మంత్రి అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఐసొలేషన్ లో ఉంచితే ఇబ్బంది ఉండదు.. అందుకే ఇంటింటి సర్వేలో జ్వర పీడితులను గుర్తించి మందులు అందజేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కువగా ఆందోళన చెందినవారే ఆసుపత్రుల వైపు పరుగులు పెడుతున్నారు అని తెలిపారు. ఆక్సిజన్, ఇతర వైద్య సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరంపై వివరాలు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. గద్వాల జిల్లాలో 1,36,925 మందిని సర్వే చేసి 3241 మందికి మందులు పంపిణీ చేయడం జరిగింది.138 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వనపర్తి జిల్లాలో 1,39,445 మందిని సర్వే చేయగా 3274 మంది లక్షణాలున్న వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఆసుపత్రిలో 62 మంది చికిత్స పొందుతున్నారు అని మంత్రి తెలిపారు.
వ్యవసాయ, దాని అనుబంధ పనులకు వెళ్లే రైతులకు, ఇతరులకు ఎలాంటి పాసులు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో బయటకు వెళ్లే వారికే పాసులు ఇస్తామన్నారు. హమాలీల కొరతను అరికట్టాలి. ధాన్యం బస్తా బరువు 40 కిలోలే ఉంటుంది కాబట్టి కాయకష్టం చేసే ప్రతి ఒక్కరూ బస్తాలను ఎత్తొచ్చు అని సూచించారు. ఈ దిశగా గ్రామాలలో చైతన్యం చేసి కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం బస్తాలు తరలించాలి. ధాన్యం తరలింపు, మిల్లర్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించవద్దు అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వీఎం అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, వనపర్తి ఇంచార్జ్ కలెక్టర్ వెంకట్రావు, వనపర్తి, గద్వాల అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, రఘురామశర్మ, ఎస్పీలు ఆపూర్వరావు, రంజన్ రతన్ కుమార్ , జిల్లా వైద్యాధికారులు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.