‘వాగు ఎండిపాయెరో.. పెద వాగు తడి పేగు ఎండిపాయెరా..’ అని గోరటి ఎంకన్న పాడినట్టు కూడవెల్లి వాగు ఎండిపోతుంటే ఆ వాగుకు ఆనుకొని అటూ ఇటు వేల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు పొట్టకొచ్చిన చేనును చూస్తూ తట్టుకోలేని సందర్భం.
చేబర్తి చెరువు నుంచి ప్రారంభమై మర్కూక్, జగదేవపూర్, గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, ముస్తాబాద్ మండలాల్లో ముప్ఫై గ్రామాలకు, 36 చెక్డ్యాంలతో దాదాపు 12 వేల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నీళ్లిచ్చే కల్పతరువు కూడవెల్లి వాగు. ఈ వాగును నమ్ముకొని కొందరు పెద్ద ఎత్తున వరి నాట్లు వేశారు. సరిగ్గా వరి చేను పొట్టకొచ్చిన ఈ సమయంలో వాగు లోకి నీళ్లు రాక, పంట ఎండిపోయే స్థితి వచ్చింది. రైతుల్లో తీవ్రంగా ఆందోళన మొదలైంది.
ఈ నేపథ్యంలో మార్చి 21న గజ్వేల్ మార్కెట్ యార్డులో ప్రభుత్వం మద్దతు ధరతో శనగలు కొనుగోలు చేసే కేంద్రాన్ని ప్రారంభించేందుకు మంత్రి హరీశ్రావు వచ్చారు. అప్పుడు కూడవెల్లి వాగు పరిసర గ్రామాల రైతులు మంత్రిని కలిసి కూడవెల్లి వాగులోకి గోదావరి నీటిని విడుదల చేయాలని కోరారు. మంత్రి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడారు. కొడకండ్లలో మల్లన్నసాగర్ నుంచి అక్కారం పంప్హౌజ్కు వెళ్లే కొండపోచమ్మ కాలువ నుంచి 400 మీటర్ల దూరంలో ఉన్న కూడవెల్లి వాగులోకి నీళ్లు వదిలే అవకాశం ఉందని ఇంజినీర్లు చెప్పడంతో మంత్రి రైతులతో కలిసి అక్కడికి వెళ్లి కాలువ ఆ గట్టు మీదినుంచే ముఖ్యమంత్రితో ఫోన్లో రైతుల సమస్యను వివరించారు. పంట విలువ, రైతుల కష్టం తెలిసిన కేసీఆర్ తక్షణమే పనులు ప్రారంభించి పంటలను రక్షించాలని ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో కొడకండ్ల కాలువ నుంచి కూడవెల్లి వాగు వరకు వెంటనే సర్వే నిర్వహించి, పొక్లెయినర్లను దింపి కాలువ వెళ్లే దారిలో సాగు చేసుకుంటున్న ముగ్గురు కొడకండ్ల గ్రామ రైతులను మంత్రి హరీశ్రావు ఒప్పించారు. 400 మీటర్ల కాలువ తవ్వకం 24 గంటల వ్యవధిలోనే పూర్తయింది. మార్చి 23 నాడు మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి చేతుల మీదుగా అతిపవిత్ర గోదావరి జలాలను కూడవెల్లి వాగులోకి వదిలే కార్యక్రమం పూర్తయింది. కూడవెల్లి వాగుకు కేసీఆర్ కొత్త నడక నేర్పారు. కూడవెల్లి వాగు నడక గజ్వేల్ మండలంలోని కొడకండ్ల, రిమ్మనగూడ, బూర్గుపల్లి, సింగటం, అహ్మదీపూర్ గ్రామాల్లోని చెక్డ్యాములన్నీ నింపుతూ తొగుట మండలంలోకి అడుగిడుతూ నిండుగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నది. గోదావరి నీళ్లు దుంకి పాడుతుంటే రైతుల కండ్లు ఆనందబాష్పాలతో చెమ్మగిల్లుతున్నాయి.
ఈ దృశ్యాన్నే కదా తెలంగాణ కలగన్నది. రాష్ట్రం వస్తే ఇక రంది లేకుండా వ్యవసాయం పండుగలా మారుతుందనే కల నిజంగా కేసీఆర్ పుణ్యమాని నిజమైంది. తమ పంట ఎక్కడ చేతికి రాకుండా ఎండిపోతదోనని దిగులుపడ్డ రైతులు ఇప్పుడు..
‘ఎద మీద దిగులు బండ జరిగి బాధ తొలిగెనో..
ఎండిన చెలిమె నిండిన అనుభూతి కలిగెనో..
చెరబట్టినట్టి అరవై ఏండ్ల బలిమి ఓడి..
కల నిజమాయెనని నేల తనని తడుముకున్నదో..’
అని గోరటి ఎంకన్న పాటను తమ నోటా పాడుకుంటూ మురిసిపోతున్నరు.
మాదాసు శ్రీనివాస్
ఇవి కూడా చదవండి..