వనపర్తి, జూలై 25(నమస్తే తెలంగాణ)/రేవల్లి: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న శ్రీవీరాంజనేయ (ఏదుల) రిజర్వాయర్ ముంపు నిర్వాసితులకు అండగా ఉంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రూ.27 కోట్ల తో 63 ఎకరాల్లో బండరావిపాకుల గ్రామస్థుల కోసం ఆర్అండ్ఆర్ కాలనీని అన్ని వసతులతో ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ఆదివారం ఆయన ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డితో కలిసి వనపర్తి జిల్లా రేవల్లి మండలం గౌరిదేవిపల్లి సమీపంలో ఆర్అండ్ఆర్ కాలనీ కోసం శంకుస్థాపన చేశారు. నిర్వాసితులకు ప్లాట్లకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేశారు.