చిన్నంబావి, జూలై 8: ‘సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా నాయకులు కృష్ణానదిలో అధికశాతం నీటిని వినియోగించుకుని ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. 60 ఏండ్లు దోచుకున్నారు.. రాష్ట్రం విడిపోయినా ఇంకా దోచుకుంటామంటే కుదరదు. ఏపీ ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకోవాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని అమ్మాయిపల్లి, బెక్కెం గ్రామాల్లో విద్యుత్తు సబ్స్టేషన్లను నాగర్కర్నూల్ ఎంపీ రాములు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ..1985లో బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు భీమానదిలో కేటాయించిన 20 టీఎంసీల వినియోగానికి తగ్గట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా నాయకులు ఆనకట్ట నిర్మించలేదన్నారు. 15 వేల ఎకరాలకు మించి నీటిని వినియోగించలేకపోతున్నామని తెలిపారు. భీమా 27 ప్యాకేజీ ద్వారా ఈ ప్రాంతానికి నీటిని అందించడానికి కృషి చేశామన్నారు.
కృష్ణానదిపై జోగులాంబ బరాజ్..
కృష్ణానదిపై జోగులాంబ బరాజ్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రతిపాదించినట్టు మంత్రి తెలిపారు. మొత్తం 38 టీఎంసీల నికర జలాలకు గాను కృష్ణా లో 6.5 టీఎంసీలు వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని జూరాల, భీమా మీద వెలటూరు-గుందిమల్ల మధ్య కృష్ణానదిపై జోగులాంబ బరాజ్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రతిపాదించినట్టు చెప్పారు.
మంత్రి మెచ్చిన వృషభరాజం
మంత్రి నిరంజన్రెడ్డిని ఓ వృషభరాజం ఆకట్టుకున్నది. చిన్నంబావి మండలం బెక్కెం నుంచి వెళ్తుండగా.. పెద్దదగడ గ్రామానికి చెందిన రైతు గోపాలకృష్ణకు చెందిన వృషభరాజాన్ని చూసిన మంత్రి వెంటనే కాన్వాయిని నిలిపి అక్కడికి వెళ్లి దాన్ని ఆప్యాయంగా నిమిరారు. రైతు కోరిక మేరకు ఆ వృషభానికి లవన్న (లవుడు)గా నామకరణం చేశారు.