హైదరాబాద్ : దొడ్డు వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలి.. అన్నదాతలకు కేంద్రం అండగా నిలవాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ఎఫ్సీఐ నిర్ణయం రైతాంగానికి గొడ్డలి పెట్టు వంటిది అని విమర్శించారు. అర్థాంతరంగా దొడ్డు వడ్లు కొనుగోలు చేయమని చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
బీఆర్కే భవన్లో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజేతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమై రాష్ట్ర వ్యవసాయ ప్రగతి, వ్యవసాయ పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలతో ముందుకు సాగుతున్నది. వరి సాగు నుండి నూనె, పప్పుగింజలు, ఆయిల్ పామ్ సాగు వైపు రైతాంగాన్ని మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. 2020 – 21 రెండు సీజన్లు కలిపి 141.01 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఎఫ్సీఐ ద్వారా సేకరించి తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది అని మంత్రి తెలిపారు.
పంటల మార్చిడి అనేది నిరంతర ప్రక్రియ.. దానిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకేసారి ఆకస్మికంగా రైతులు ఇతర పంటలకు మళ్లడం అనేది కష్టతరం .. కావున దొడ్డు వడ్లను సేకరించం అనే నిర్ణయాన్ని ఎఫ్సీఐ వాయిదా వేసుకోవాలి.
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది అని మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు. రైతుబంధుకు రూ. 15 వేల కోట్లు, రైతుభీమాకు రూ.1440 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు, రూ.10 వేల కోట్లతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు సరఫరా, పంటల కొనుగోళ్లు ఇలా దాదాపు రూ.55 వేల కోట్ల నుండి రూ.60 వేల కోట్లు వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర స్థూల ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 2013 – 14 లో 13.8 శాతం నుండి 2019 – 20లో 19.3 శాతానికి, 2020 – 21లో 20.90 శాతానికి పెంచుకోవడం జరిగింది. కరోనా క్లిష్ట పరిస్థితులను తట్టుకుని నిలబడడం విశేషం అని అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2013 – 14లో రూ.1.12 లక్షల నుండి 2019 – 20లో 103 శాతం వృద్దితో రూ.2.28 లక్షలకు చేరుకుని దేశంలో 14 వ స్థానం నుండి 5 స్థానానికి చేరుకున్నది అని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి చెంది ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని మంత్రి తెలిపారు. వ్యవసాయం, పంటల ఉత్పత్తిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రాలు వృద్దిచెందేందుకు కేంద్రం తోడ్పాటునందించాలి. తెలంగాణ మామిడికాయకు అంతర్జాతీయ ప్రసిద్ది ఉంది. కానీ కేంద్రం నుండి తగినంత సహకారం లేదు అని నిరంజన్ రెడ్డి చెప్పారు.
వరికి ప్రత్యామ్నాయంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును అత్యంత ప్రాధాన్యతగా ముందుకు వెళ్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ కు వంద శాతం రాయితీపై నిధులను ఉదారంగా కేటాయించాలన్నారు. వంటనూనెల దిగుమతుల మీద ఏటా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం ద్వారా ఆ ఖర్చును తగ్గించవచ్చు. వ్యవసాయరంగంలో ప్రాధాన్యత లేని రాష్ట్రాలకు బదులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ ఘడ్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యతనిచ్చి అధిక నిధులు కేటాయించాలి. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా దేశంలో పంటల ఉత్పత్తి ఉండేలా రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహం ఉండాలి. రాష్ట్రాల అవసరాలు, వ్యవసాయ పథకాల ప్రాధాన్యతను గుర్తించి దానికి అనుగుణంగా కేంద్రం నుండి నిధులు కేటాయించాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.