సియోల్: ఇది చదవడానికి కాస్త వింతగా అనిపిస్తుంది కానీ.. ఇద్దరు పాకిస్థాన్కు చెందిన రాయబారులు చాక్లెట్లు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. సౌత్ కొరియా రాజధాని సియోల్లో ఉన్న పాక్ ఎంబసీకి చెందిన వీళ్లు వేర్వేరు తేదీల్లో ఈ దొంగతనాలు చేసి దొరికిపోయారు. ఒకరేమో 11 వేల వాన్ (10 డాలర్లు)ల విలువైన, మరొకరు 1900 వాన్ (1.7 డాలర్లు)ల విలువైన వస్తువులు దొంగతనం చేస్తూ దొరికినట్లు ది కొరియా టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది.
జనవరి 10న ఓ వ్యక్తి చాక్లెట్లు దొంగతనం చేస్తూ, ఫిబ్రవరి 23న మరో వ్యక్తి ఓ టోపీ దొంగతనం చేశారు. టోపీ దొంగతనం తర్వాత ఆ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి వాళ్లను పట్టుకున్నారు. అయితే రెండు దేశాల దౌత్యపరమైన అంశం కావడంతో వాళ్లపై కేసు నమోదు చేయకుండానే వదిలేశారు. దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ ఒప్పందం ప్రకారం.. రాయబారులు, వాళ్ల కుటుంబ సభ్యులు అరెస్ట్ లేదా నిర్బంధాన్ని తప్పించుకోవచ్చు.