మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖాన ముందు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఓ వ్యక్తి రోడ్డు నిర్మాణం కోసం వేసిన కంకరపైనే కూర్చొని చెప్పులు కుట్టుకుంటున్నాడు. చిన్న గొడుగు నీడలో పనిచేసుకుంటున్నా.. ఎండ ప్రభావానికి కంకర నుంచి వచ్చే వేడి తట్టుకునే పరిస్థితి లేదు.
అయినా బతుకుదెరువు కోసం తన పని తాను చేసుకుని జీవిస్తున్నాడు. అదే సమయంలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించేందుకు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అటుగా వచ్చారు. చెప్పులు కుట్టుకుని జీవించే వ్యక్తిని గమనించాడు. రోడ్డుపై ఎండలో రోడ్డుపై అతని పరిస్థితికి చలించిపోయిన మంత్రి వెంటనే అతని వివరాలు ఆరా తీశారు.
తన పేరు నర్సింహ అని తనది పట్టణంలోని వీరన్నపేటగా చెప్పిన ఆ యువకుడు తన పరిస్థితిని మంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి ఇటీవలే నిర్మించిన వీధి వ్యాపారుల షెడ్డులో ఓ దుకాణం నర్సింహకు ఇప్పించారు. మున్సిపాలిటీ సిబ్బంది సాయంతో సదరు వ్యక్తి సామగ్రిని వీధి వ్యాపారుల షెడ్డుకు తరలించారు.
ఇకపై ఎండలో కష్టపడకుండా నీడపట్టున హాయిగా వ్యాపారం చేసుకునాలని మంత్రి నర్సింహకు సూచించారు. స్వయంగా మంత్రే వచ్చి తన పరిస్థితికి చలించి తనకో ఆసరా చూపించినందుకు నర్సింహ కృతజ్ఞతలు తెలిపాడు.