తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సూపర్ కమర్షియల్ దర్శకులలో గుణశేఖర్ కూడా ఒకడు. లాఠీ, సొగసు చూడ తరమా లాంటి సినిమాలతో ఈయన ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా చూడాలని ఉంది, ఒక్కడు లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ముఖ్యంగా ఒక్కడు సినిమా ఇప్పుడు చూసినా కూడా ఫ్రెష్ గానే ఉంటుంది. మహేష్ బాబుకు అప్పటి వరకు లేని మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చిన సినిమా ఒక్కడు. 18 ఏళ్ళ కింద సంచలన రికార్డులను తిరగరాసి గుణశేఖర్ ను టాప్ డైరెక్టర్ గా మార్చేసింది ఈ చిత్రం. దానికి ముందు చూడాలని ఉంది సైతం రికార్డులను తిరగరాసింది. బాల రామాయణం లాంటి సినిమాలతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసాడు ఈయన. అయితే ఒక్కడు తర్వాత ఈయన లయ తప్పింది.
అర్జున్, సైనికుడు, నిప్పు లాంటి సినిమాలు గుణశేఖర్ లోని ఆ కమర్షియల్ దర్శకుడిని బయటికి తీసుకురాలేకపోయాయి. దాంతో ఈయన పంథా మార్చేసాడు. రుద్రమదేవితో పూర్తిగా పీరియాడికల్ వైపు అడుగులు వేసాడు. చరిత్రను తెలుసుకుంటూ.. చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. రాణి రుద్రమ కథను నాలుగేళ్ల పాటు కూర్చుని రాసుకుని 2015లో అనుష్క శెట్టితో చేసాడు గుణశేఖర్. ఈ సినిమాను తానే నిర్మించాడు కూడా. పైగా ఇది 3డి సినిమా కూడా. దాని తర్వాత మరోసారి పీరియాడికల్ కథల వైపుకే అడుగులు వేస్తున్నాడు. మధ్యలో హిరణ్య కశ్యప అంటూ రానాతో సినిమా ప్లాన్ చేసాడు. అయితే అది వర్కవుట్ కాలేదు. దాంతోపాటు రుద్రమదేవి కొడుకు ప్రతాప రుద్రుడు బయోపిక్ తీయడానికి ప్లాన్ చేసాడు గుణశేఖర్.
అది కూడా కుదర్లేదు. దాంతో ఇప్పుడు శాకుంతలం అంటూ మరో హిస్టారికల్ సినిమాతో వస్తున్నాడు ఈ దర్శకుడు. భారతంలోని శాకుంతల, దుష్యంతుడి లవ్ స్టోరీ ఇది. హై బడ్జెట్.. అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాను తానే నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా పూర్తిగా మైథాలజీ, హిస్టరీపైనే ఆధారపడుతున్నాడు ఈ ఈ దర్శకుడు. ఇదంతా చూస్తుంటే గుణశేఖర్ నుంచి మరోసారి రెగ్యులర్ కమర్షియల్ సినిమా రావడం కాస్త కష్టమే అనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.