3 నుంచి 12వ తరగతి విద్యార్థులందరికీ అవకాశం
ఈ నెల 20వ వరకు దరఖాస్తుల స్వీకరణ
ఆన్లైన్ లో 22న పరీక్షలు
భూపాలపల్లి రూరల్/ములుగు టౌన్, మే 16: కొవిడ్తో పాఠశాలలకు సెలవులొచ్చి విద్యార్థులు ఇంటికే పరిమితమైన తరుణంలో వారిలో ని మేధస్సు, సామాజిక స్పృహను పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు, టీఎస్ఎన్జీసీ సంయుక్తంగా విద్యార్థులకు ఆన్లైన్లో పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భా గంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న 3 నుంచి 12వ తరగతి(ఇంటర్) విద్యార్థులందరికీ ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులకు ఈ నెల 22న ఆన్లైన్ పోటీలు నిర్వహించనున్నారు.
ఆన్లైన్లో పోటీ పరీక్షలు
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో ప్రత్యేకంగా జీవ వైవిధ్య అంశాలపై విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించే వారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా ఆన్లైన్ పోటీలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 20 వరకు https:///tsepbr.org/pbr-event వెబ్సైట్లో పూర్తి వివరాలు, సెల్ నంబర్ నమోదు చేసుకోవాలి. అనంతరం వారి సెల్కు సంక్షిప్త సందేశం రూపంలో వివరాలు పంపిస్తారు. ఈ నెల 22న ఆన్లైన్లో విద్యార్థుల తరగతుల వారీగా వ్యాసరచన, ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం, ఉపన్యాసం, నృత్యం, కార్టూన్ డిజైనింగ్, నినాదాలు, ఆధునిక వస్త్రధారణ వంటి ఎనిమిది అంశాలపై పోటీలు నిర్వహిస్తారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆన్లైన్ ధ్రువపత్రాలు కూడా అందజేస్తారు.