న్యూఢిల్లీ: కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల కరోనా థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోగలమని అన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కే విజయ్రాఘవన్. ఇలా చేయడం వల్ల కనీసం అన్ని ప్రాంతాల్లో లేదా ఎక్కడా రాకుండా కూడా అడ్డుకోగలమని ఆయన చెప్పారు. అయితే అది స్థానికంగా అంటే రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, పల్లెల్లో మార్గదర్శకాలను ఎంత సమర్థంగా అమలు చేస్తున్నారన్నదానిపై ఆధారపడి ఉంటుందని విజయ్రాఘవన్ అన్నారు. ఇక కొవిడ్ నుంచి కోలుకున్న వాళ్లలో బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్మిసిస్ వస్తుందన్న వార్తలపై స్పందిస్తూ.. దీనిని తాము జాగ్రత్తగా గమనిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని కూడా ఆయన స్పష్టం చేశారు.