వరంగల్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం వరంగల్ మహానగరానికి వస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 వరకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి దాదాపు 40 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా మొత్తం రూ.1,700 కోట్లతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. గ్రేటర్ పరిధిలోని రాంపూర్, శాయంపేట జంక్షన్లో రోజూ తాగునీటి సరఫరా ప్రక్రియను ప్రారంభిస్తారు. ఖిలా వరంగల్, శాయంపేట జంక్షన్ల వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరున్నరేండ్లుగా నగరాభివృద్ధి కోసం చేపట్టిన ప్రగతిని మంత్రి కేటీఆర్ ప్రజలకు వివరించనున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, టీ రాజయ్య పర్యవేక్షించారు.