రంగారెడ్డి జిల్లాలో 276 కోట్లు.. మొత్తంగా 5,350 కోట్ల ఆదాయం
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభంతో అతలాకుతలమైన గత ఆర్థిక సంవత్సరంలో కొన్ని రంగాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఊతంగా నిలిచాయి. ముఖ్యంగా రియల్ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో ఆస్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. స్థిరాస్తుల రాబడి చివరి నాలుగు నెలల్లో భారీగా పుంజుకున్నది. వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా మార్చి నెలాఖరు వరకు వచ్చిన ఆదాయం రూ.5,350 కోట్లు దాటినట్టు సమాచారం. ఒక్క మార్చి నెలలోనే దాదాపు రూ.990కోట్లు వచ్చినట్టు తెలిసింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ. 276 కోట్ల రాబడి వచ్చింది.
ధరణి పోర్టల్ కోసం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 14వరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 29 నుంచి ధరణి పోర్టల్లో ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 14 తరువాత రిజిస్ట్రేషన్ల జోరు పెరిగింది. మార్చిలో సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తెరిచి ఉంచారు. మొత్తంగా ఈ ఏడాది 12 లక్షల వరకు దస్తావేజులు రిజిస్టర్ అయ్యాయి.
గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కరోనా సంక్షోభం వల్ల మొదటి ఆరునెలల వరకు సగానికి సగం తగ్గిన సొంత పన్నుల రాబడి ఆ తర్వాత దేశంలోనే అత్యంత వేగంతో పుంజుకున్నది. కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గినప్పటికీ రాష్ట్రం సొంత ఆదాయంపై ఆధారపడి నిలదొక్కుంది. వాణిజ్యపన్నుల రాబడి 2019-20 కంటే 2020-21లో ఎక్కువగా నమోదైంది. గతంలో జీఎస్టీ, విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారా రూ.45 వేల కోట్ల వరకు వచ్చిన ఆదాయం ఈ సారి రూ.50 వేల కోట్లు దాటింది. మద్యం అమ్మకాల ద్వారా రూ.15 వేల కోట్లు సమకూరాయి. ఇది కూడా గత ఏడాది కంటే రూ.4వేల కోట్లు అధికం కావడం విశేషం.
కరోనా వల్ల రెవెన్యూ ఆదాయంలో దాదాపు రూ.30 వేల వరకు గండిపడింది. తాజా సమాచారం ప్రకారం రెవెన్యూ రాబడులు మొత్తంగా రూ.లక్ష 15వేల కోట్ల వరకు సమకూరినట్టు తెలిసింది. అన్ని రకాల రాబడులు కలిసి రూ.1.82లక్షల కోట్లు వస్తాయని అంచనా వేయగా.. రూ.1.60లక్షల కోట్ల వరకు పరిమితమైంది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే గత బడ్జెట్ అంచనాలలో 70 నుంచి 80 శాతం ఫలితాలు సాధించి తెలంగాణ ఆర్థిక సవాళ్లను తట్టుకుని నిలిచింది. గురువారం మొదలవుతున్న 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెవెన్యూ రాబడులు రూ.1.76 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ దిశలో అప్పుడే ఆర్థిక వ్యూహం అమలు మొదలైంది.
ఇవి కూడా చదవండి:
మహేశ్కు మంత్రి కేటీఆర్ భరోసా
ఎఫ్సీఐ కావాలనే ఇబ్బంది పెడుతున్నది
ఆటో వద్దనే భూమి రిజిస్ట్రేషన్
రామాయణం, భారతం ప్రపంచానికే తలమానికం
మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు
స్వచ్ఛ సర్వేక్షణ్లో హైదరాబాద్షా