హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ విజయవంతంగా కొనసాగుతున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే 97 నుంచి 98 శాతం రికార్డులు క్లియర్ అయ్యాయని తెలిపారు. త్వరలోనే భూ సమస్యల్లేని రాష్ట్రం ఆవిష్కృతం అవుతుందని చెప్పారు. ధరణితో సమాజంలో మంచి మార్పు వచ్చిందని, ఇలాంటిది తన జీవితంలో చూడలేదని పేర్కొన్నారు. ఇందులో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉన్నదని తెలిపారు. శనివారం ఆయన టీన్యూస్లో జరిగిన ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో మాట్లాడారు. ధరణితో వేగంగా, సులభంగా, పారదర్శకంగా లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు 3.70 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయని, 2.7 లక్షల కొత్త పాస్ పుస్తకాలను పంపిణీచేశామని వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి తెస్తున్నామని, ప్రస్తుతం ధరణిలో 25 మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు వాటిపై అవగాహన పెంచుకొని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వాటిని వేగంగా పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలకు సాధారణంగా వచ్చే సందేహాల నివృత్తికి ‘ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్’ మాడ్యూల్ను సిద్ధంచేశామని, రెండుమూడు రోజుల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సోమేశ్కుమార్ పలువురితో ఫోన్లో మాట్లాడి.. వారి భూ సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ధరణిని ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు.
నిషేధిత జాబితా నుంచి తొలగించుకోండి
ఏదైనా ఒక సర్వే నంబర్లో ఇద్దరి మధ్య న్యాయ వివాదం ఉండటం, కొంత ప్రభుత్వ భూమి ఉండటం వంటి కారణాల వల్ల ఆ సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో పొందుపరిచారని సోమేశ్కుమార్ చెప్పారు. నిషేధిత జాబితానుంచి తొలగించుకునేందుకు ధరణిలో తాజాగా ఆప్షన్ తీసుకొచ్చామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీపీఏలకు సంబంధించి ధరణిలో మాడ్యూల్స్ ఉన్నాయని, ఎవరైనా మోసం చేసినట్టు తేలితే వాటిని నిషేధిస్తామని హెచ్చరించారు. నగర శివారు భూములకు సంబంధించి ఐప్లె ఫర్ పీపీబీ ఫర్ సెమీ అర్బన్ ల్యాండ్స్ ఆప్షన్ కింద ఇప్పటివరకు 180 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఈ చలాన్/గ్రీవెన్స్ స్టేటస్ ఆప్షన్ ద్వారా మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉన్నదో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
90 రోజుల్లో సాదాబైనామాల పరిష్కారం
సాదాబైనామాలకు 9 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వాటిని అధికారులు పరిశీలిస్తున్నారని సోమేశ్కుమార్ చెప్పారు. నూతన రెవెన్యూ చట్టం నేపథ్యంలో కోర్టు కేసు పెండింగ్లో ఉండటం వల్ల దరఖాస్తులను పరిష్కరించడంలేదని తెలిపారు. కోర్టు స్టే తొలగిన తర్వాత 90 రోజుల్లో ప్రక్రియను పూర్తిచేసి అర్హులకు పట్టాలు అందజేస్తామని చెప్పారు. వాటి రిజిస్ట్రేషన్ మండలకేంద్రంలోనే జరుగుతుందని స్పష్టంచేశారు. మార్టిగేజ్ లోన్లకు సంబంధించి అప్పు పూర్తిగా చెల్లించినా బ్యాంకర్లు భూమిని రిలీజ్ చేయడంలేదంటూ కొందరు ఫిర్యాదు చేస్తున్నారని ఆయన తెలిపారు. ధరణిలో ప్రత్యేకంగా బ్యాంకర్ల కోసం మాడ్యూల్ ఇచ్చామని.. ఒకవేళ అప్పు మొత్తం తీర్చేస్తే వాళ్లు కచ్చితంగా భూమిని రిలీజ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో బ్యాంకర్లు సహకరించాలని ఆయన కోరారు.