హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ టీమ్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. భారత హాకీ టీమ్ అద్భుతమైన చరిత్రను సృష్టించిందని కేటీఆర్ కొనియాడారు. మిమ్మల్ని చూసి ఈ దేశం గర్వ పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ట్వీట్ చేశారు.
ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 1980 తర్వాత ఒలింపిక్స్ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్ 5-4 తేడాతో చిత్తు చేసింది.
41 సంవత్సరాల సుధీర్ఘ విరామం అనంతరం పతకాన్ని సాధించి ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసింది. మ్యాచ్లో రెండు, మూడు క్వార్టర్స్లో భారత స్ట్రయికర్లు సత్తా చాటగా.. ఆఖరి క్వార్టర్లో జర్మనీ క్రీడాకారులు దూకుడు ప్రదర్శించినా.. డిఫెండర్లు, గోల్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. పలు పెనాల్టీ కార్నర్లను గోల్ కాకుండా అడ్డుకొని ఒలింపిక్ పతకాన్ని ఒడిసిపట్టారు.