రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణ అభివృద్ధికి తాను సిద్ధంగా ఉన్నానని, పాలకవర్గం కలిసికట్టుగా ప్రతిపాదనలు అందించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వేములవాడ పురపాలక సంఘం పాలకవర్గంతో.. పట్టణ అభివృద్ధిపై రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మరో 15 రోజుల్లో వచ్చి పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను. పరిశుభ్రత, పచ్చదనంతో పాటు అవసరమైన అభివృద్ధి పనులను కూడా అప్పటికప్పుడు అంచనా వేద్దామన్నారు. పాలకవర్గ సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేయించాలన్నారు. మున్సిపల్ పరిపాలన భవనంలో అవసరమైన సామాగ్రిని కూడా అంచనా వేస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులు విస్తరించేందుకు.. సంబంధిత యజమానులతో చర్చించి, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. వేములవాడ మండల పరిషత్ కార్యాలయం కాంప్లెక్స్ లోనూ క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలన్నారు. తిప్పాపూర్లోని స్టేడియం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
వేములవాడ పట్టణంలో నిర్మాణంలో ఉన్న స్మృతివనం వెంటనే పూర్తి చేసి, మరో స్మృతివనం నిర్మాణానికి స్థలాన్ని కూడా ఎంపిక చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మర్రిపల్లిలో ఉన్న 200 ఎకరాల్లో అర్బన్ డెవలప్మెంట్ కింద అటవీ పార్కు నిర్మిద్దామన్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని తాసిల్దార్, కమిషనర్కు ఆదేశించారు. చెరువు శిఖం భూముల్లో ఐదు ఎకరాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించాలని మంత్రిని కౌన్సిలర్ మహేష్ కోరారు. పార్కులు, చిన్నారుల ఆటల కోసం కూడా స్థలాలు ఎంపిక చేస్తే తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. విలీన గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించుదామని చెప్పారు. ఇందుకనుగుణంగా నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. స్మృతివనం, పార్కుల కోసం స్థలాలు కూడా గుర్తించి అంచనాలు రూపొందించాలి అని కేటీఆర్ ఆదేశించారు.
మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం అమలు లేకపోవడాన్ని కమిషనర్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పరిపాలన అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం అని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ అధ్యక్షురాలు మాధవి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, కలెక్టర్ కృష్ణ ప్రసాద్, విటీడీఏ వైస్ చైర్మన్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి, ఈఎన్సీ శ్రీధర్, ఎస్ఈ శ్రీనివాస రావు, విటీడీఏ కార్యదర్శి భుజంగరావు, కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, డిఈ ప్రసాద్, సెస్ ఏడి సత్తయ్య, ఏఈ సుష్మా, మున్సిపల్ ఏఈలు పాల్గొన్నారు.