హైదరాబాద్ : అద్భుత టూరిస్ట్ డెస్టినేషన్గా మానేరు రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేస్తామని మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో వివిధ శాఖల అధికారులతో కలిసి మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కేవలం కరీంనగర్కే కాకుండా తెలంగాణకే తలమానికంగా ఉండాలన్నారు. దేశంలోని ఇతర రివర్ ఫ్రంట్ల కన్నా అద్భుతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. మానేరు రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ని దేశంలోని ఇతర ప్రాజెక్టుల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న ఇరిగేషన్, రెవెన్యూ, టూరిజం, మునిసిపల్, ఆర్అండ్బి, పంచాయతీరాజ్ వంటి శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం కోసం రూ. 310 కోట్లు కేటాయించిన నేపథ్యంలో అద్భుతమైన డిజైన్లతో ఈ ఫ్రంట్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టు కేవలం కరీంనగర్ పట్టణానికి కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారే అవకాశం ఉన్నదని, పూర్తిస్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్, వరంగల్ వంటి జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కరీంనగర్ పట్టణానికి ఐటీ టవర్ ద్వారా ఐటీ పరిశ్రమ కంపెనీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని, రివర్ ఫ్రంట్ కార్యక్రమం పూర్తయిన తర్వాత కరీంనగర్ పట్టణం మరింతగా అభివృద్ధి అవుతుందన్న ఆశాభావం కేటీఆర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం సాగునీరు కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల తోపాటు టూరిజం రంగంలోనూ అనేక అవకాశాలు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్లో అంతర్భాగమైన ఐదు చెక్ డాంలు, కేబుల్ బ్రిడ్జి పూర్తి కావస్తున్నాయి అని గంగుల కమలాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ఈ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.