పోచమ్మమైదాన్, మార్చి 29 : వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీవాసవీమాత ఆలయంలో దాదాపు ఎనిమిది లక్షల పార్ధీవ లింగాలకు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసర పీఠాధిపతి నిర్మల అంబయ్యశాస్త్రి ఆశ్రమంలో నిర్మించనున్న స్తూపంలో కోటి లింగాలను వేయనున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి లక్షలాది లింగాలను తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే వరంగల్, హన్మకొండ, కాజీపేటకు చెందిన వేలాది మంది భక్తులు ఒక కిలో పుట్టమన్నుతో 365 చొప్పున 8 లక్షల వరకు పార్ధీవ లింగాలను తయారు చేశారు. వీటిని వాసవీమాత ఆలయానికి తీసుకొచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో ఏర్పాటు చేయనున్న స్తూపానికి ఉపయోగించే పార్ధీవ లింగాలను భక్తిశ్రద్ధలతో పూజించి, పీఠాధిపతి అంబయ్యశాస్త్రికి అప్పజెప్పారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి సేకరిస్తున్న లక్షలాది లింగాలను కలుపుకుని మొత్తం కోటి లింగాలను స్తూపంలో వేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వాసవీమాత ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించి, బాసరకు పంపుతున్నట్లు వివరించారు. అలాగే, భక్తులందరికీ అన్నదానం చేసినట్లు వారు వివరించారు.