హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో భారతీయ గోల్ఫర్ అదితి అశోక్ తృటిలో పతకం కోల్పోయింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో అదితికి నాలుగవ స్థానం దక్కింది. నాలుగవ రౌండ్లో అదితి వెనుకబడడంతో.. ఆమెకు మెడల్ దక్కే అవకాశం మిస్సైంది. నిజానికి టోక్యో క్రీడల్లో అదితి అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ఊహించని రీతిలో ఆమె దూసుకువెళ్లింది. మూడవ రౌండ్ వరకు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గోల్ఫర్ అదితి అశోక్.. చివర్లో కాస్త తడబడింది. కీలకమైన నాలుగవ రౌండ్లో ఓ దశలో న్యూజిలాండ్ గోల్ఫర్తో సమానంగా నిలిచింది. కానీ రసవత్తరంగా సాగిన గోల్ఫ్ ఆటలో.. అమెరికాకు చెందిన కోర్డా నెల్లి గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్నది.
వరల్డ్ ర్యాంకింగ్లో 200వ స్థానంలో ఉన్న అదితి.. గోల్ఫ్లో అంచనాల్లేకుండా బరిలోకి దిగి ఒక్కో రౌండ్ను అధిగమిస్తూ ప్రపంచ ర్యాంకు ప్లేయర్లకు షాకులిచ్చింది. అదితి అద్భుత ప్రదర్శనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ఒలింపిక్స్లో తృటిలో పతకాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ అదితి అద్భుత ప్రదర్శనను కనబరిచింది. యువ అదితి అశోక్ అద్భుతమైన ఆటతీరుకు ఇవే మా శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.