హైదరాబాద్ : టీఆర్ఎస్ నాయకుడు, పార్టీ ఇన్సూరెన్స్ విభాగం నిర్వాహకుడు కావేటి లక్ష్మీనారాయణ (57) సోమవారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. లక్ష్మీనారాయణ పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కావేటి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన కావేటి ఆరున్నరేండ్లుగా టీఆర్ఎస్ ఇన్సూరెన్స్ విభాగం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్ మూ సాపేటలో ఉంటున్న లక్ష్మీనారాయణకు సోమవారం గుండెపోటు రావడంతో దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు, కోడలు పుణెలో వైద్యులు. ఒక కుమార్తె కెనడాలో, మరొకరు హైదరాబాద్లో ఉంటున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సాఫీగా కొనసాగేందుకు లక్ష్మీనారాయణకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. లక్ష్మీనారాయణ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. కావేటి మరణంతో సేవాతత్పరత, నిబద్ధత గల నాయకుడిని పార్టీ కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు.