కోల్కతా, మే 18: నారద స్కాంలో సుబ్రత ముఖర్జీ, ఫిర్హద్ హకీం తదితర తృణమూల్ నేతలను అరెస్టు చేసిన సీబీఐ.. ఈ కేసులో తృణమూల్ మాజీ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని సీనియర్ జర్నలిస్ట్ మాథ్యూ శామ్యూల్ ప్రశ్నించారు. ‘ఇది సంతోషకరమైన రోజు. స్కాం వెలుగులోకి వచ్చి చాలా ఏండ్లయింది. 2016లో స్టింగ్ ఆపరేషన్ వీడియోలు విడుదలయ్యాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలను సీబీఐ టచ్ చేయలేకపోయింది. మూడేండ్ల కిందటే కేసులో చార్జిషీట్ రెడీ అయింది’ అని ఆయన పేర్కొన్నారు.
‘సువేందుకు ఆయన కార్యాలయంలోనే నేను స్వయంగా డబ్బులు ఇచ్చాను. కానీ, సీబీఐ రూపొందించిన నిందితుల జాబితాలో ఆయన పేరు లేదు. ఏమైంది? ఆయన డబ్బు తీసుకున్నట్టు ఫోరెన్సిక్ నివేదికలోనూ నిరూపణ అయింది. నా స్టేట్మెంట్ కూడా సీబీఐ తీసుకున్నది. నా నుంచి డబ్బులు తీసుకున్నట్టు సువేందు అంగీకరించినట్టు నాకు తెలిసింది.’ అని ఆయన తెలిపారు. ఈ కేసులో మాజీ తృణమూల్ నేతలు ముకుల్రాయ్, సువేందు పేర్లు కూడా బయటకు వచ్చాయి.