అర్వపల్లి, జూన్ 11: భర్తను కోల్పోయి అష్టకష్టాలు పడుతూ ముగ్గురు కూతుళ్లతో జీవనం సాగిస్తున్న ఓ ఆడబిడ్డకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. సదరు మహిళ తన సమస్యపై ట్వీట్ చేయడంతో మంత్రి వెంట నే ఆమెను ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కు సూచించా రు. ఎమ్మెల్యే బాధిత మహిళకు ఆర్థిక సాయం అందించారు.
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం ఆవాసం చాకలిగూడేనికి చెందిన దర్శనం సతీశ్ లారీ డ్రైవర్గా పనిచేస్తూ 8 నెలల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయనకు భార్య శిల్ప, ముగ్గురు ఆడపిల్లలున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన శిల్ప తన దయనీయ స్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరిని ట్యాగ్ చేస్తూ రీ ట్వీట్ చేయడంతో ఎమ్మెల్యే శుక్రవారం శిల్ప ఇంటికి వెళ్లి ముగ్గురు చిన్నారులు అక్షిత, లాస్య, బేబీ పేరిట బ్యాంకు ఖాతా తీయించి రూ.1.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. మరో రూ.50 వేలను శిల్పకు అందించారు. అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగ అవకాశం, చిన్నారులకు ఉచిత విద్య, డబుల్ బెడ్రూం ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆపద్బాంధవుల్లా తమను ఆదుకున్న మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్కు శిల్ప కృతజ్ఞతలు తెలిపారు.