మద్దూరు మండలంలో కంటికి రెప్పలా మొక్కల సంరక్షణ
మండుటెండల్లో ట్యాంకర్ల ద్వారా ప్రతీ మొక్కకు నీరు
ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్న మొక్కలు
మద్దూరు, ఏప్రిల్ 29 : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2015 జూలై 3న అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో సీఎం కేసీఆర్ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రాంభించారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఆరో విడుతలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ యజ్జంలా చేపట్టారు. నాటిన మొక్కలను గాలికి వదిలేయకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా సంరక్షణ చర్యలు చేపట్టి మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. దీంతో ప్రస్తుతం హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి, పచ్చదనాన్ని పంచడంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఉమ్మడి మద్దూరు మండల వ్యాప్తంగా నాల్గో విడుత హరితహారంలో భాగంగా 2018-19లో 1,40,181, ఐదో విడుత 2019-20లో 3,15,540 మొక్కలు నాటారు. ఈ ఏడాది 2,13,575 మొక్కలు నాటడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ప్రభుత్వం మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఓ ట్రాక్టర్తో పాటు వాటర్ ట్యాంకర్ను మంజూరు చేసింది. ఈ వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రతి మొక్కకు సరిపడా నీరందిస్తున్నది. ముఖ్యంగా మండే ఎండాకాలంలో సైతం మొక్కలకు నీరందిస్తున్నారు. దీనికితోడు మొక్క చుట్టూ ఉపాధి కూలీలతో కలుపు తీసి, పాదులు తవ్విస్తున్నారు. మొక్కలను గొర్రెలు, మేకలు, పశువులు తినకుండా ఉండేందుకు ట్రీగార్డులు, కంచెలు పెడుతున్నారు. మొక్కల సంరక్షణ కోసం ప్రతి గ్రామానికి ఇద్దరేసి చొప్పున హరిత సైనికులను ఏర్పాటు చేశారు. 400 మొక్కలకు ఒక్క వాచ్గార్డును ఏర్పాటు చేశారు. మొక్కలు ఏపుగా, త్వరగా పెరిగేందుకు సేంద్రియ ఎరువులు చల్లుతున్నారు. దీంతో మొక్కలు రెండు మూడేండ్ల వ్యవధిలోనే వృక్షాలుగా మారి పచ్చదనాన్ని పంచుతున్నాయి. నాలుగు విడుతలుగా రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటగా, ప్రస్తుతం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేసిన హరిత నర్సరీలలో సైతం మొక్కలను కాపాడేందుకు నర్సరీ చుట్టూ, పైన పచ్చని నెట్లను ఏర్పాటు చేశారు.