హైదరాబాద్ : ఎలక్ర్టానిక్ తయారీ రంగంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎలక్ర్టానిక్ తయారీ రంగానికి ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
రాష్ర్టంలో 250కి పైబడిన కంపెనీల్లో ఎలక్ర్టానిక్స్ రంగంలో ఒక లక్షా 60 వేల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. ఎలక్ర్టానిక్స్ తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా పరిగణించింది. విధాన రూపకల్పనలో భాగంగా పరిశ్రమల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఒక ప్రత్యేక ఎలక్ర్టానిక్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ర్టంలో విద్యుత్ వాహనాలు, ఇంధన నిల్వ వ్యవస్థలను సత్వరమే చేపట్టి.. తయారీ, ఆర్ అండ్ డీని అభివృద్ధి చేసేలా చూడటానికి విద్యుత్ వాహకం 2020 నుంచి 2030 వరకు ఇంధన నిల్వ విధానాన్ని ప్రారంభించింది. క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా ఓఆర్ఆర్ వెలుపల 912 ఎకరాల విస్తీర్ణంలో రెండు ఎలక్ర్టానిక్ క్లస్టర్ల తయారీని కలిగి ఉంది. వచ్చే నాలుగేళ్లలో రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళిలు రూపొందించామన్నారు. ఎలక్ర్టానిక్ తయారీ రంగం అభివృద్ధికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎలక్ర్టానిక్ వాహనాల తయారీ రంగ పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గత 6 సంవత్సరాల్లో 23 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాం. తెలంగాణ ఏర్పడక ముందు ఈ రంగంలో 50 వేల ఉద్యోగాలు మాత్రమే ఉండేవి. రాష్ర్టం ఏర్పడిన తర్వాత అదనంగా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించుకున్నామని తెలిపారు. ఎలక్ర్టానిక్స్ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త నిబంధనలు చేర్చామని కేటీఆర్ తెలిపారు.