హైదరాబాద్ : తైవాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ (హాన్ హై టెక్నాలజీ గ్రూప్) తెలంగాణలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే. తారక రామారావు గురువారం ఢిల్లీలో ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తిలో తెలంగాణలో ఉన్న అనుకూల పర్యావరణ వ్యవస్థలపై వివరించారు.
తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తూ, అవకాశాలను తెలుసుకునేందుకు రాష్ట్రాన్ని సందర్శించాలని ఆయన ఫాక్స్కాన్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. ప్రపంచంలో ఎలక్ట్రాకిక్స్ తయారీలో అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సంస్థల్లో ఫాక్స్కాన్ ఒకటని, సదరు సంస్థ ఈవీల తయారీలో కూడా ప్రవేశించాలని నిర్ణయించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా ఉందని, అత్యంత అధునాతన ఆర్ అండ్ డీ, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందన్నారు.
Had a promising meeting with Chairman of Foxconn Mr. Young Liu & his team today
Discussed wide range of subjects from EVs, Digital Health, Electronics & Robotics
Welcomed him to invest in Telangana pic.twitter.com/58y7lIaibS
— KTR (@KTRTRS) June 23, 2022
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ఇప్పటికే అనేక అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందని పేర్కొంటూ, ఫాక్స్కాన్ సైతం తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ రంగంలో శరవేగంగా పురోగమిస్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తిచేశారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలు కల్పించే పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్ వివరించారు. యంగ్ లియు మాట్లాడుతూ భారత్లో తమ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికను గురించి వివరించారు.
గత ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని కేటీఆర్ తెలపగా, దీనిపై యంగ్ లియు సంతృప్తి వ్యక్తంచేశారు. భారత్ ఆకర్షణీయ తయారీ గమ్యస్థానంగా ఉందని, అందుకే తమ కార్యకలాపాలను ఇక్కడ విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. భారత్లో తమ వ్యాపారం ఎంతో సానుకూలంగా ఉందని, తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న ప్రోత్సాహకాలు, అక్కడి అవకాశాలను అందుకునేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, డైరెక్టర్ సుజయ్ కారంపూరి సమావేశంలో పాల్గొన్నారు.