హైదరాబాద్ : నగరంలోని చారిత్రక పర్యాటక ప్రదేశం ట్యాంక్బండ్పై ప్రతీ ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించాలన్న నెటిజన్ల సూచనకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సమ్మతి తెలిపారు. పౌరుల సూచనను ఆహ్వానించిన మంత్రి ఈ మేరకు తమ సిబ్బందితో కలిసి యోచించాల్సిందిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు ట్విట్టర్ ద్వారా మంగళవారం విజ్ఞప్తి చేశారు.
ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. సర్ ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు ఎందుకు విధించకూడదు. ట్యాంక్బండ్పై తమ ప్రభుత్వం కల్పించిన అందమైన సౌకర్యాలను నగర పౌరులు ఆస్వాదిస్తారు. వాహనాల నిరంతర ప్రయాణంతో కుటుంబాలతో కలిసి వచ్చే వారు రోడ్డును కుడి నుండి ఎడమకు.. ఎడమ నుండి కుడికి దాటేందుకు ప్రయాసలు పడాల్సి వస్తుందన్నాడు. ఈ సూచనను మంత్రి కేటీఆర్ ఆహ్వానిస్తూ పరిశీలించాల్సిందిగా హైదరాబాద్ సీపీకి సూచించారు.
నగరం నడిబొడ్డున ఉన్న సుందర సరస్సు హుస్సేన్ సాగర్. దీనికి తూర్పు వైపున ట్యాంక్ బండ్ రోడ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలను కలిపే రహదారి. 450 సంవత్సరాల పురాతన సరస్సుపై సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూసేందుకు నగర వాసులు తరలివస్తుంటారు. సెలవు రోజుల్లో రద్దీ మరీ ఎక్కువ. 2.2 కిలోమీటర్ల పొడవైన ఈ విశాల రహదారికి ఇరువైపులా ఫుట్పాత్లు ఉన్నాయి. ప్రముఖ తెలుగు కవులు, స్వాతంత్య్ర సమరయోధులు, నాయకుల విగ్రహ చిహ్నాలు కొలువుదీరి ఉన్నాయి.
సికింద్రాబాద్ వైపు రహదారిలో యుద్ధ ట్యాంక్ పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఆధునిక హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించే విధంగా, ప్రపంచస్థాయి నగర కూడలిగా ట్యాంక్బండ్ను తీర్చిదిద్దాలనే కేటీఆర్ విజన్ మేరకు ట్యాంక్బండ్ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. అటు చారిత్రక వైభవానికి ప్రతీకగా, ఇటు ఆధునిక కలబోతగా ట్యాంక్బండ్ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. రూ.38 కోట్ల అంచనా వ్యయంతో మొదటిదశ సుందరీకరణ పనులు చేపట్టిన మున్సిపల్ విభాగం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాస్ట్ ఐరన్ రైలింగ్, గ్రిల్స్, డిజైనర్ ల్యాంప్ పోస్టులను ఇప్పటికే ఏర్పాటు చేసింది. కాలిబాటలు సైతం ఫ్లేమ్డ్ గ్రానైట్తో పునరుద్దరించబడ్డాయి.
సీటింగ్, షాపింగ్, పార్కింగ్తో సహా సౌకర్యాలను సమకూరుస్తున్నారు. రెండో దశలో సరస్సు వెంబడి లేక్ వ్యూ నైట్ బజార్ను అభివృద్ధి చేయనున్నారు. సహజ సౌందర్యం సొంతం చేసుకున్న హుస్సేన్సాగర్ బోటింగ్, చుట్టుపక్కల పార్కులు లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, పీపుల్స్ ప్లాజా, ఫుడ్ పాయింట్లు, ఈట్ స్ట్రీట్, ఐమాక్స్ థియేటర్ వంటి సదుపాయాలతో వేలాది మందిని ఆకర్షిస్తుంటుంది. ఇటువంటి సుందర ప్రదేశాన్ని ప్రశాంతంగా వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్ నియంత్రణ అవసరమేన్న పౌరుల విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సై అన్నారు.