హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కరోనాకాలంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు అందిస్తున్న వైద్యసిబ్బంది దేవుళ్లతో సమానమని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు కొనియాడారు. వైద్యసిబ్బంది అంతా ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు సేవచేయాలని సూచించారు. దేశంలోనే తొలి మొబైల్ మెడికల్ యూనిట్, మొబైల్ ఐసీయూ యూనిట్ బస్సులను గురువారం ట్యాంక్బండ్పై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పెద్దమొత్తంలో నిధులు సేకరించి 30 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన లార్డ్స్ చర్చి బృందానికి, వారికి సహకరించిన వెర హెల్త్ కేర్ సర్వీసెస్, వైద్య సిబ్బందిని అభినందించారు. మొదట ఈ ఆలోచన గురించి చెప్పినప్పుడు తాను ఆశ్చర్యపోయానని, ఇంత త్వరగా చేయగలరా? అని సందేహిస్తే.. అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారని గుర్తుచేసుకొన్నారు.
ఇలాంటి సేవ దేశంలోనే తొలిసారి అని అన్నారు. తొలి విడతలో 30, రెండో విడతలో మరో30 బస్సులు ఒక్కో జిల్లాకు రెండు చొప్పున అందుబాటులోకి తేవచ్చని సూచించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ వంటి దూర ప్రాంతాలకు ఒక్కో మొబైల్ మెడికల్ యూనిట్ను పంపి సేవలు అందించవచ్చని చెప్పారు. ఒక్కో బస్సులో 8 బెడ్లు, ఆక్సిజన్, కాన్సన్ట్రేటర్లు, ఇన్వైజ్ వెంటిలేటర్ ఏర్పాట్లు అద్భుతమని పేర్కొన్నారు. ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు అందుబాటులో ఉంటారని చెప్పారు. కరోనాను ఎదుర్కోడానికి సహకారం అందించేందుకు ముందుకొచ్చిన లార్డ్స్ చర్చి బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలు గోవర్ధన్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, సీఎస్ సోమేశ్కుమార్, ఫాస్టర్ ఆఫ్ ది లార్డ్స్ చర్చి రాజ్ప్రకాశ్ పౌల్ తదితరులు పాల్గొన్నారు.