న్యూఢిల్లీ, జూన్ 8: కరోనా మహమ్మారితో దేశం యావత్తూ తల్లడిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల బాధలను తొలగించేందుకు సుప్రీంకోర్టు చొరవ తీసుకుని కీలక ఆదేశాలు జారీచేయడం సంతోషంగా, గర్వంగా ఉన్నదని కేరళకు చెందిన పదేండ్ల బాలిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది. అత్యున్నత న్యాయస్థానానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసింది. లేఖతోపాటు సీజేఐ తన సుత్తితో కరోనాను చంపుతున్నట్టుగా ఉన్న ఫొటోను కూడా పంపింది. చిన్నారి హృద్యమైన లేఖకు ముగ్ధ్ధులైన సీజేఐ.. ఆమెకు ప్రత్యుత్తరం పంపారు. కరోనా నేపథ్యంలో ప్రజల క్షేమం పట్ల బాలిక చూపిన తాపత్రయాన్ని ఆయన అభినందించారు. స్వదస్తూరితో చిన్నారి రాసిన లేఖ యథాతథంగా… ‘నా పేరు లిద్వినా జోసెఫ్. త్రిసూర్లోని కేంద్రీయ విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్నా. హిందూ దినపత్రికలో దేశ ప్రధాన వార్తలు చదువుతుంటా. ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కరోనా కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోవడం నన్ను కలిచివేసింది. కరోనాపై పోరాటంలో సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలపై గౌరవ న్యాయస్థానం జోక్యం చేసుకున్నట్టు పత్రిక ద్వారా నాకు తెలిసింది. ఆక్సిజన్ సరఫరాకు న్యాయస్థానం తగిన ఆదేశాలు జారీచేసి అనేకమంది ప్రాణాలు నిలుపడం సంతోషంగా, గర్వంగా ఉన్నది. ఇందుకు మీకు ధన్యవాదాలు’ అని ఆ బాలిక లేఖలో పేర్కొన్నది. చిన్నారి లేఖకు సీజేఐ బదులిస్తూ.. ‘నీ అందమైన లేఖతోపాటు, హృదయాన్ని హత్తుకునేలా ఉన్న జడ్జి చిత్రం నాకు అందింది’ అని తెలిపారు. ‘నీవు బాధ్యతాయుత పౌరురాలిగా ఎదుగుతావని, దేశ నిర్మాణానికి పాటుపడుతావని కచ్చితంగా చెప్పగలను’ అని పేర్కొన్నారు. అలాగే చిన్నారికి తాను సంతకం చేసిన రాజ్యాంగ ప్రతిని కూడా పంపారు.