హైదరాబాద్: ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్లు, పెట్టుబడులకు తెలంగాణ మొదటి చాయిస్గా మారిందని చెప్పారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో రెండో ఐటీ పాలసీని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏ టెక్నాలజీ అయినా సామాన్య ప్రజల అవసరాలను తీర్చేలా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్తుంటారని వెల్లడించారు. టెక్నాలజీ ఆధారిత పాలనకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. డ్రైవింగ్ లెసెన్స్ టెస్ట్ కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో తలసరి ఆదాయం ఏడేండ్లలో దాదాపు రెట్టింపయిందని చెప్పారు. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలో ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటికంటే ఐటీ ఎగుమతులు రెండింతలు అయ్యాయని వెల్లడించారు. 2013-14లో రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు.. 2020-21 నాటికి రూ.లక్షా 45 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. ప్రపంచంలో అత్యున్నత ఐదు కంపెనీలు హైదరాబాద్లో తమ ఆఫీస్లను ఏర్పాటు చేశాయన్నారు. అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఐదు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయని మంత్రి చెప్పారు. 15 వందల స్టార్టప్లకు సహాయం అందించామని, టాస్క్ ద్వారా మూడు లక్షల మందికి పైగా నిపుణులను తయారు చేశామన్నారు. ఐదు వందలకు పైగా ప్రభుత్వ సేవలు మీ సేవ ద్వారా అందిస్తున్నామని వెల్లడించారు. స్మార్ట్ గవర్నమెంట్ విభాగంలో తెలంగాణ జాతీయ అవార్డులు గెలుచుకుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని 5 లక్షల మందికిపైగా డిజిటల్ ఎడ్యుకేషన్ అందించామన్నారు. ప్రైవేటు కంపెనీలతో కలిసి రూ.13 వందల కోట్లతో స్టార్టప్లను పోత్సహిస్తున్నామన్నారు. ప్రధాన ఐటీ కంపెనీలు రాష్ట్రంలోని టైర్-1, టైర్-2 సిటీలపై కూడా దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్రంలో 40 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో నాస్కామ్ చైర్మన్ రేఖ మీనన్, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. నూతన ఐటీ పాలసీ 2026 వరకు అమల్లో ఉండనుంది.