హైదరాబాద్ : దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేసి.. రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర జరుగుతుందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గువ్వల బాలరాజు శాసనసభలో మాట్లాడారు. రిజర్వేషన్లను ఎత్తేసే ప్రయత్నం జరుగుతుందనే ఆందోళన కలుగుఉతున్నది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను, కేసీఆర్ తమకు ఇస్తున్న అవకాశాలను గమనిస్తున్నామని తెలిపారు. అంబేడ్కర్, కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుని, తమ హక్కులను కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్దపడుతాం. తమ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించం అని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయకపోతే తమ పదవులకు సార్ధకత ఉండదన్నారు. తమ రిజర్వేషన్లను ఎత్తేస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ఆదానీ, అంబానీలను ప్రోత్సహించడం కాదు.. దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా.. కేంద్రం మాత్రం దళిత, బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో రాష్ర్ట ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనడంలో అర్థం లేదన్నారు. ఉద్యోగ నియామకాలపై కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత.. ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం మానేశాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శవంతంగా ఉందన్నారు. అధికారంలోకి రావాలనే ఆలోచనను పక్కన పెట్టి.. అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి గువ్వల బాలరాజు చురకలంటించారు.