‘మంచిగ చేసినం.. మళ్లీ మేమే గెలుస్తం’ అని ధీమా వ్యక్తంచేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించాలని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని, రిస్క్ వద్దు.. కేసీఆరే ముద్దు అని వారు భావిస్తున్నారని తెలిపారు. కులాల పంచాయితీ.. మత చిచ్చు లేని స్వచ్ఛమైన పాలనను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ సార్వజనీన నాయకుడని స్పష్టంచేశారు. కేసీఆర్ ఏకపక్ష గెలుపును అడ్డుకొనేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని విమర్శించారు. కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేయాలన్న కుత్సిత బుద్ధితోనే రాహుల్గాంధీ, నరేంద్రమోదీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షం ఎన్ని కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ ఈసారి 88 స్థానాల కన్నా అధికంగానే గెలుచుకోబోతున్నదని తేల్చి చెప్పారు. ప్రస్తుత ఎన్నికల తీరు, ప్రజల ఎజెండా, భవిష్యత్ ప్రణాళికలపై ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ సవివరంగా సమాధానమిచ్చారు.
Minister KTR | హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించాలని ప్రజలు ఎప్పుడో డిసైడయ్యారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ‘తొమ్మిదిన్నరేండ్లలో మంచిగ చేసినం.. మళ్లీ మేమే వస్తం’ అని స్పష్టంచేశారు. ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ‘నమస్తే తెలంగాణ’కు ఆదివారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టి వచ్చారు కదా.. ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తున్నది..? ప్రజల నుంచి అద్భుతమైన స్పందన కనిపిస్తున్నది.
సీఎంగారు ఇప్పటికే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా మ్యానిఫెస్టో కూడా విడుదల చేశాం. పార్టీపై మూడోసారి కూడా సానుకూలతనే కనిపిస్తున్నది. కేసీఆర్కు సరితూగే నేత కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరున్నారు చెప్పండి..? అక్కడక్కడ నియోజకవర్గ స్థాయి నేతలపై ఒకవేళ అసంతృప్తి ఉన్నా.. నారాజ్గా ఉన్నా గునుగుడు గునుగుడే.. గుద్దుడు గుద్దుడే అని మా కార్యకర్తలు చెప్తున్నారు. ఎవరైనా అక్కడక్కడ అలిగినా.. అసంతృప్తిగా ఉన్నా అందరికీ కేసీఆర్ గారి నాయకత్వంపై అపారమైన విశ్వాసం ఉన్నది. అందుకే ఆయనకే ఓటేస్తామని చెప్తున్నారు. ప్రజల్లో అసాధారణమైన స్పష్టత ఉన్నది.
అభ్యర్థులను, మ్యానిఫెస్టోను ముందుగానే ప్రకటించడంలో మీ వ్యూహమేంటి?
అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం మాకు లాభం అవుతుంది. అక్కడక్కడ ఏమైనా అసంతృప్తులుంటే వాటిని సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగపడింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ఇచ్చిన తర్వాత మేం ఇచ్చాం. మా మ్యానిఫెస్టోపై ప్రజలకు నమ్మకం ఉన్నది. బీజేపీ ఇప్పటివరకు మ్యానిఫెస్టోను కూడా ప్రకటించలేకపోయింది.
ఇక సిట్టింగ్లకే మళ్లీ మేము టికెట్లు ఇచ్చాం. ఇది కూడా వ్యూహాత్మకమే. ఎందుకంటే మేము సిట్టింగులకు టికెట్లు ఇవ్వకపోతే వారిని చేర్చుకొని టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. అందుకే రేవంత్రెడ్డి ‘దమ్ముంటే సిట్టింగులకు టికెట్లు ఇవ్వండి’అని అన్నాడు. మేము సిట్టింగులకు ఇవ్వకపోతే.. అభ్యర్థుల కొరతతో అలమటిస్తున్న కాంగ్రెస్కు కొందరు దొరికేవారేమో.. కానీ, పాపం వారి ఆశలు అడియాసలయ్యాయి.
ఇప్పటికీ వారికి 35-40 సీట్లలో వారికి అభ్యర్థులు లేరు. కొన్నిచోట్ల మాకు సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వక తప్పలేదు. మహబూబ్నగర్లో మాకు ముగ్గురే బీసీ అభ్యర్థులు ఉన్నారు. 9 మంది రెడ్లు ఉన్నారు. కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డి టికెట్ ఆశించినా ఇవ్వలేకపోయాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాకు ఒకే ఒక రెడ్డి అభ్యర్థి ఉన్నాడు. పెద్దపల్లిలో మనోహర్రెడ్డి తప్ప మిగిలిన స్థానాల్లో ఆ సామాజిక వర్గం వారు లేరు. అక్కడ కూడా మాకు వేరే ఆప్షన్ లేదు. మా అభ్యర్థులను కాపాడుకోవడం ఒక అంశమైతే, మేం గెలిస్తే ఏం చేస్తామన్నదానిపై స్పష్టమైన హామీని మ్యానిఫెస్టో ద్వారా ఇవ్వగలిగాం.
పరుగులు పెడుతున్న తెలంగాణకు బ్రేక్లు పడితే నష్టపోయేది తెలంగాణ యువతే. ఈ విషయంలో యువత ఆలోచించాలి. తెలంగాణలో ధృడమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు బాగవుతున్నాయి. ఇది కాదని కొత్త ఒక వింత పాత ఒక రోత అనుకుంటే నష్టపోయేది తెలంగాణ సమాజం.
– కేటీఆర్
రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ వస్తుందంటారా..? మీ అంచనాలేమిటి..?
ముమ్మాటికీ మరోసారి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. మనదేశంలో ఎన్నికల తీరును గమనిస్తే 90 శాతం రిజెక్షన్ అన్నదే ప్రధానంగా కనిపిస్తుంది. 10 శాతం మాత్రమే సెలెక్షన్ ఉంటుంది. మన పనితీరు బాగాలేకపోతే, ప్రజలు ఒక ప్రభుత్వాన్ని దించాలనుకుంటే ఏం చేసినా దాన్ని మార్చలేం. ఉదాహరణకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే. ఆ ఎన్నికలకు మూడేండ్ల ముందే బీజేపీని రిజెక్ట్ చేయాలని ప్రజలు నిర్ణయించారు. అక్కడ వారికి కాంగ్రెస్ ప్రత్యామాయంగా కనిపించింది.
కాంగ్రెస్ గొప్పగా చేసిందేమీలేదు. ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య, ఖర్గే, డీకే శివకుమార్ గ్రూపులు కట్టకుండా కలిసిపోయారు. అందువల్ల అక్కడ ఆ పార్టీ గెలిచింది. అంతేగానీ వీళ్లేదో బాగా చేస్తారని కాదు. 2014లో రాష్ట్రం ఏర్పడ్డ అసాధారణ సందర్భం. అప్పుడు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అనేది ఉద్యమపార్టీ కాదు.. ఇక మీదట ఫక్తు రాజకీయ పార్టీగా ఉంటుందని చెప్పి సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజల్లో ఒక హోప్ కనిపించింది. అందుకే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినపుడు కూడా ప్రజల్లో కొత్త నమ్మకం కనిపించింది. బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ పెట్టినపుడు కూడా ఇదే తరహాలో కనిపించింది.
ఇలాంటిది కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. 90 శాతం ఒకరు నచ్చకపోతే మరొకరికి అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ గారు మంచిగానే చేసిండు కదా.. మళ్లా అవకాశం ఇద్దామన్నట్టుగానే పరిస్థితి ఉన్నది. మా పట్ల ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత లేదు. అదే మా బలం. కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేండ్లలో కులాల కుంపట్లు రాజేయ్యలేదు.. మత విద్వేష మంటలు పెట్టలేదు.. ప్రాంతీయ పక్షపాతం చూపలేదు.. స్వచ్ఛమైన అచ్చమైన అభివృద్ధి రాజకీయం ఎట్లుంటదో ఆచరించి చూపిన ఆదర్శవాది కదా? అట్లాంటి లీడర్ను వదులకొని కుల పిచ్చిగాళ్లను, మతచిచ్చుగాళ్లను నెత్తిన పెట్టుకుందామా? దీని గురించి కూడా ప్రజలు ఆలోచన చేయాలి.
కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందనే వాదనపై ఏమంటారు?
తెలంగాణలో బీఆర్ఎస్ను నిలువరించి 40-50 సీట్లకు పరిమితం చేస్తే కేసీఆర్ ఇక రాష్ట్రం దాటి వెళ్లడన్న భావన రాహుల్, మోదీ కి ఉంటుంది. అదే కేసీఆర్కు 90-100 సీట్లు వస్తే దీని ప్రభావం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై కూడా ఉంటుంది కదా? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తెలంగాణపై పడుతుందని చెప్తున్న మేధావులు, తెలంగాణ ఎన్నికల ప్రభావం పక్క రాష్ట్రాలపై కూడా పడుతుందన్న ఆలోచన ఎందుకు చేయటంలేదు? కేసీఆర్ 90-100 సీట్లతో మూడోసారి సీఎం అయితే మహారాష్ట్ర నేతలు ఇక్కడికి క్యూ కడ్తారు కదా? మరి 2024 ఎన్నికలకు ఇంకో నేత ఎమర్జ్ అవుతాడంటే.. మహారాష్ట్రలో ఏమైనా పార్లమెంటు సీట్లు వస్తే వాళ్లకు కష్టం కదా? అందుకే ఇక్కడనే నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ను ఏకపక్షంగా గెలిపించొద్దు అన్నట్టుగా ఉన్నది బీజేపీ, కాంగ్రెస్ తీరు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు పోటీపడి ఆరోపణలు చేస్తున్నాయి కదా?
ఇవ్వాళ మోదీ, రాహుల్కు కేసీఆర్ కొరకరాని కొయ్య. వాళ్లిద్దరికి తాము తప్ప మూడో వ్యక్తి జాతీయ రాజకీయాల్లో ఉండొద్దన్న అభిప్రాయం ఉంటుంది. వాళ్లిద్దరూ దేశంలో మరో నేతను ఓర్వలేరు. ఒక్క కేసీఆర్ విషయంలోనే కాదు.. స్టాలిన్, కేజ్రీవాల్, మమత.. ఇలా ఎవ్వరినీ భరించలేరు. దీనికి ఉదాహరణ మేడిగడ్డ బరాజ్ అంశమే. రాహుల్గాంధీ వచ్చి ఎక్స్పాన్షన్ జాయింట్లను చూసి పగుళ్లు అంటాడు.. మోదీయేమో నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ అధికారులను పంపిస్తాడు. దున్నపోతు ఈనిందని ఒకరంటే, దూడను కట్టేయమని మరొకరు అన్నట్టుగా ఉన్నది పరిస్థితి.
కేసీఆర్ను తెలంగాణకు పరిమితం చేయాలి లేదా ఓడించాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్నాయి. దీంట్లో భాగంగానే రాహుల్గాంధీ వెళ్లి మేడిగడ్డను చూసి వస్తే, దానికి మోదీ సర్కారు విచారణ కమిటీని వేస్తుంది.. ఆ కమిటీ బీజేపీ ఇచ్చిన స్క్రిప్టును రెండంటే రెండు రోజుల్లోనే విడుదల చేస్తుంది. అంటే ఇదంతా కుట్రపూరితమే కదా? వాళ్ల కమిటీ వాళ్లకు నివేదిక ఇస్తే.. మా కమిటీ మాకు ఇస్తది. కాళేశ్వరంపై ప్రజలు రియాక్ట్ అవ్వడంలేదు. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలుసు. వాళ్ల అనుభవం వేరుగా ఉన్నది.
బీఆర్ఎస్లో సామాజిక సమతూకం లేదు అనే విమర్శ ఉన్నది. దీనికి మీ సమాధానం?
దేశంలో కులం, మతం, వర్గం అనేవి మనం పుట్టించుకున్న కథలే. వాస్తవాలు కావు. అంతిమంగా నాయకుడు ఏ కులం? ఏ వర్గం అని చూడకుండా ఆ నాయకుడు ఎవరికి మేలు చేసిండు? ఏం చేస్తున్నడు? అనేదే ముఖ్యం. ప్రజలు దాన్నే చూస్తరు. ప్రధాని మోదీ ఓబీసీ. దేశంలో బీసీలందరూ బాగుపడ్డరా? కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తరువాత కొన్ని సందర్భాల్లో సామాజిక సమతూకం పాటించలేకపోవచ్చు. కానీ, దాన్ని కేసీఆర్ ఎలా బ్యాలెన్స్ చేశారు. ముదిరాజ్లకు సీటు రాలేదని కొందరు అంటరు.
కానీ అదే ముదిరాజ్ను పార్లమెంట్కు తీసుకెళ్లిన పార్టీ బీఆర్ఎస్. అదే ముదిరాజ్ను ఎల్పీ లీడర్ను చేసిందెవరు? 2004లో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకున్నప్పుడు పోటీచేసింది 42. అందులో ముదిరాజ్లకు కేసీఆర్ ముదిరాజ్లకు 4 సీట్లు ఇచ్చారు. మహబూబ్నగర్లో శ్రీనివాస్, కమలాపూర్లో ఈటల రాజేందర్, అంబర్పేటలో గోవింద్, కార్వాన్ ఇలా మొత్తం 10 శాతం సీట్లు ముదిరాజ్లకు ఇచ్చారు. మనకన్నా వంద శాతం ప్రజలు తెలివైన వాళ్లు. నాయకుల విన్యాసాలన్నీ చూస్తరు. కులం ఫ్రేమ్లో కేసీఆర్ను కొట్టాలని ప్రతీసారి చూశారు. ఏం జరిగింది? ఇప్పుడు కూడా అలాంటి ప్రయోగాలే చేస్తున్నరు. కానీ కేసీఆర్కు సార్వజనీన ఆమోదం ఉన్నది. కేసీఆర్ ఈజ్ అన్స్టాపబుల్.. అంతే.
బీఆర్ఎస్కు రెండుసార్లు అధికారం ఇచ్చారు? మూడోసారి ఎందుకివ్వాలి?
మనకు జ్వరం వస్తే ఒక డాక్టర్ దగ్గరికి పోతం. అతని మందులతో తగ్గింది అనుకోండి.. మళ్లా జ్వరం వచ్చినప్పుడు అతని దగ్గరికే పోతం. మంచిచేసేవాడిని వదులుకోం కదా! కేసీఆర్ విషయంలోనూ అంతే. కేసీఆర్ మంచిగ జేసిండు. జనం ఆయన్ను ఎందుకు వదులుకొంటారు? కేసీఆర్ కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చే లీడర్ రాష్ట్రంలో ఎవరు? బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో బీఆర్ఎస్ కన్నా మెరుగైన నమూనా ఉంటే చూపించండి? పదేండ్లలో ఇంత వృద్ధి సాధించినప్పుడు.. ఇంతకన్నా మెరుగైన ఫలితాలు అందించే నాయకుడే లేనప్పుడు.. రెండుసార్లు ఇచ్చాం కదా అనేది అసలు లాజిక్కే కాదు.
మన జేబుల వంద రూపాయల నోటున్నది. మనం నడుచుకుంటా పోతుంటే రోడ్డుమీద చిల్లర పైసలు కనిపించినయి అనుకుందాం. వాటికోసం వంగితే.. జేబుల ఉన్న నోటు పడిపోతది. ఇక్కడ నోటేమో కేసీఆర్.. చిల్లర పైసలు కాంగ్రెస్, బీజేపీ. నోటు జేబులో ఉన్నంతకాలం మనకు విలువ తెలువది. పోయినప్పుడే దాని విలువ తెలుస్తది. చిల్లర మాటలకు పడిపోతే ఆగమైపోతం. ‘రిస్క్ వద్దు మనకు కేసీఆరే ముద్దు’ అని ప్రజలు బలంగా నమ్ముతున్నరు. అదే జరుగబోతున్నది.
అభ్యర్థుల ఎంపికలో మీకు, మీ ప్రత్యర్థి పార్టీలకు తేడా ఏంటి?
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు టికెట్లు అయినా, బీఫామ్స్ అయినా అన్నీ ఢిల్లీ నిర్ణయించాలి. ఇప్పుడు వయా బెంగళూరు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని తెలంగాణ గల్లీ తేల్చాలి.. ఢిల్లీ గద్దె కాదు. స్థానికంగా ఉండి ఎవరు పనిచేస్తారో అది ప్రజలకు స్పష్టంగా తెలుసు.
రాహుల్గాంధీ వచ్చి ఎక్స్పాన్షన్ జాయింట్లను చూసి పగుళ్లు అంటాడు.. మోదీయేమో నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ అధికారులను పంపిస్తాడు. దున్నపోతు ఈనిందని ఒకరంటే, దూడను కట్టేయమని మరొకరు అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. కేసీఆర్ను తెలంగాణకు పరిమితం చేయాలి లేదా ఓడించాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్నాయి.
– కేటీఆర్
30 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనే వాదన ఉన్నది. దీనికి మీ సమాధానం?
1,60,283 ఉద్యోగాల భర్తీ పూర్తయింది. మా మీద దాడిచేసేవాళ్లు ఈ దేశంలో ఇంతకన్నా ఎక్కువ భర్తీ చేసిన ఒక్క రాష్ట్ర ప్రభుత్వమైనా ఉంటే దయచేసి చూపండి అని అడుగుతున్నాం. మేం చేసిందేదో చెప్పేలోపే కొందరు గందరగోళం సృష్టించారు. టీఎస్పీఎస్సీలో నమోదైన 30 లక్షల మంది సంపూర్ణ నిరుద్యోగులు కాదు. గ్రూప్ 1, 2,3 4 సహా అన్ని రకాల పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నది 12 లక్షల మంది. విషయాన్ని లోతుగా అధ్యయనం చేయకుండా నోరుపారేసుకోవటం ప్రతిపక్షాలకు అలవాటైపోయింది.
ఈ సారి పూర్తిస్థాయిలో చేయలేకపోయాం. వచ్చేసారి ప్రణాళికాబద్ధంగా చేస్తాం. ప్రభుత్వంలో ఉద్యోగాలకు పక్కాగా జాబ్క్యాలెండర్ జారీ చేస్తామని ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాట ఇస్తున్నా. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ రంగంలో ఇప్పటికే 24 లక్షల మందికి ఉపాధి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఇంతకన్నా నిబద్ధతతో చేసిన ప్రభుత్వం ఒక్కటైనా ఉన్నదా?
టీఎస్పీస్సీ పేపర్ లీకేజీ ప్రభావం ఎన్నికల మీద ఏమైనా ఉంటదా?
పేపర్ లీకేజీ దురదృష్టకరమే. పొరపాట్లకు దిద్దుబాటు చర్యలుంటాయి. ఆ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడొక విషయాన్ని గమనించండి. పేపర్ లీకేజీ తరువాత చిత్తశుద్ధితో దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నదెవరు? అసలు లీకేజీ అని చెప్పిందే ప్రభుత్వం. దీన్నెవరైనా ప్రతిపక్షాలు గుర్తించాయా? తప్పు జరిగిన తరువాత మా నిబద్ధత చూడండి. యూపీఎస్సీ చైర్మనే టీఎస్పీఎస్సీ అద్భుత సంస్కరణలు చేసిందని, టీఎస్పీఎస్సీ అనుసరించిన విధానాలు ఇతర రాష్ర్టాలు అనుసరించాలని చెప్పిన విషయం నిజం కాదా?
ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది?
ఎన్నికలపై సోషల్మీడియా ప్రభావం ఉంటుంది. కానీ ప్రజలు చాలా తెలివిమంతులయ్యారు. ఆర్టిఫిషియల్.. ఆర్కెస్ట్రేటెడ్.. మ్యానుఫ్యాక్చర్డ్ హడావిడితో ఏదో చేస్తానంటే అది తాత్కాలికమే.
ప్రజలు అవకాశం ఇస్తే పాలిస్తాం. లేదంటే రెస్ట్ తీసుకుంటాం అనీ సీఎం కేసీఆర్ అన్నారు కదా.. దీనిపై మీరేమంటారు?
ఓడిపోతే వ్యక్తిగతంగా జరిగే నష్టం లేదు’ అని సీఎం కేసీఆర్ ధైర్యంగా, బాధ్యతగా బహిరంగంగా చెప్పారు. తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను ఒక దరికి చేర్చిన నాయకుడిగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు ఎదురుదెబ్బ తగిలితే నష్టపోయేది కచ్చితంగా రైతులు.. తెలంగాణ సమాజం. 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అని కర్ణాటక ఉపముఖ్యమంత్రే బాహాటంగా చెప్పారు.
అట్లాంటిది రేపు కాంగ్రెస్కు పొరపాటున అవకాశం ఇస్తే 5 గంటల కరెంటా? మూడు గంటల కరెంటా? ఆలోచించుకోవాలి. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించటంలో మనం బెంగళూరును దాటాం. పరుగులు పెడుతున్న తెలంగాణకు బ్రేక్లు పడితే నష్టపోయేది తెలంగాణ యువతే. ఈ విషయంలో యువత ఆలోచించాలి. తెలంగాణలో ధృడమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు బాగవుతున్నాయి. ఇది కాదని కొత్త ఒక వింత పాత ఒక రోత అనుకుంటే నష్టపోయేది తెలంగాణ సమాజం. కేసీఆర్కో, పార్టీకో పెద్దగా నష్టం లేదు అనే విషయంలో స్పష్టత ఉన్నది.
అందుకే ధైర్యంగా కేసీఆర్ ధైర్యంగా కుండబద్ధలుకొట్టారు. దేశం మునిగిపోయినా ఫర్వాలేదు. కానీ నేను అధికారంలోకి రావాలి అనుకునేవాళ్లు ఎక్కువున్నరని మొన్న జయప్రకాశ్ నారాయణ అన్నరు. అలాంటివారికి అధికారం ఇస్తే నష్టపోమేది ప్రజలు. దేశాన్ని తాకట్టు పెట్టి అయినా సరే అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తున్నది. తాత్కాలిక ప్రయోజనాల కోసం కేసీఆర్ మీద కోపం తీర్చుకోవాలని చూస్తే నష్టపోయేది సమాజం. కులం, మతం, ప్రాంతం అని పిచ్చిలేకుండా ఈ తొమ్మిదిన్నరేండ్లు అభివృద్ధి, మంచి ఆశయం, స్వచ్ఛమైన రాజకీయం చేసే కేసీఆర్ కావాలా? మన భవిష్యత్తును దెబ్బకొట్టే పార్టీ కావాలా? అనేది ప్రజలే ఆలోచించుకోవాలి.
పార్టీ విషయానికొస్తే.. అంతర్గతంగా ఈసారి ఎలాగైనా ఫలానా అభ్యర్థిని ఓడించాలి అన్న వాతావరణం అక్కడక్కడా ఉన్నట్టు కనిపిస్తున్నది. మీరేమైనా గుర్తించారా?
కొంతమంది బుద్ధిలేనివాళ్లు ఉంటారు. అక్కడక్కడా తమతమ స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తిగత వైరాలు, ఎజెండాలు పెట్టుకొని పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. పార్టీ అన్నీ గమనిస్తున్నది. ఇప్పటికే అటువంటి వారికి పద్ధతి మార్చుకోవాలని స్పష్టమైన హెచ్చరిక చేశాం. మార్చుకుంటున్నరు. పార్టీ అన్ని విషయాలను గమనిస్తున్నది. ప్రతీ నియోజకవర్గంలో వార్రూమ్స్ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఎవరేం చేస్తున్నారు? ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నరు? అనే విషయం నిమిష నిమిషానికి తెలిసిపోతున్నది. ఎవరెంత పెద్దవాళ్లు అయినా సరే.. పార్టీ సీరియస్గా ఉంటుంది. అటువంటి వారిని ఉపేక్షించం.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిసీట్లు వస్తాయని మీ అంచనా?
గతంలో కన్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 2018 ఎన్నికల్లో మాకు 88 సీట్లు వచ్చాయి. అంతకన్నా ఈసారి ఎక్కువే వస్తా యి. మొదటి సారి 63, రెండోసారి 88 అంటే మొదటిసారి కన్నా 25 సీట్లు అధికంగా వచ్చా యి. ఇప్పుడు అస్పష్టంగా ఉందని రకరకాల ప్రచారాలు చేస్తున్నరు. కానీ అంతిమంగా ఫలి తం మాత్రం పక్కాగా గత ఎన్నికల కన్నా అధికంగా వస్తాయి. 88పైగా సీట్లలో గెలుస్తున్నాం.
2014లో ప్రజలు తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్కు, 2018లో సంక్షేమం ఇచ్చిన సారుకు ఓటేశారు. మరి మీరిప్పుడు ఏ నినాదంతో గెలుస్తారు?
మంచిగ చేసిండు. మళ్లొస్తడు. ఇదే నినాదంతో ముందుకు పోతం. పోలింగ్ బూత్లో మీట నొక్కే ముందు రిస్క్ వద్దు.. తెలంగాణ మళ్లీ పరాధీనం కావద్దు అని ఆలోచించాలని కోరుతున్నం. తెలంగాణకు సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష. మంచి పనులు చేసినం కనుకనే మళ్లీ గెలుస్తం అని కాన్ఫిడెంట్గా చెప్తున్నా.
మనకు జ్వరం వస్తే ఒక డాక్టర్ దగ్గరికి పోతం. అతని మందులతో తగ్గింది అనుకోండి.. మళ్లా జ్వరం వచ్చినప్పుడు అతని దగ్గరికే పోతం. మంచిచేసేవాడిని వదులుకోం కదా! కేసీఆర్ విషయంలోనూ అంతే. కేసీఆర్ మంచిగ జేసిండు. జనం ఆయన్ను ఎందుకు వదులుకొంటారు? కేసీఆర్ కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చే లీడర్ రాష్ట్రంలో ఎవరు?
– కేటీఆర్
కొన్నిచోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే దానికి మీ స్పందన?
కేసీఆర్గారికి అవతలివాళ్లకు పోలిక లేదు. ఎమ్మెల్యేలకాడికి వచ్చేసరికి కొంత గులుగుడు ఉన్నది. కానీ గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే. తెలంగాణ సమాజం కేసీఆర్ను వదులుకోదు. ఎందుకు వదులుకోదంటే ఆయన కుటుంబ పెద్ద.. తెలంగాణ సమాజానికి ఈయన పెద్దాయన. అసంతృప్తులు ఏవొచ్చినా అవి తాత్కాలికమే. ఏది ఏమైనా కేసీఆరే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నరు. సర్వే సర్వత్రా అదే తేలుతున్నది. ఈ అంశమే అన్నింటిని అధిగమిస్తది.
కేసీఆర్ మీద ఈటల, రేవంత్ పోటీచేస్తారట. దీన్నెలా చూస్తారు?
ఎవరైనా చేయవచ్చు. అందులో ఎవరికీ అభ్యంతరం లేదు. ఓడిపోతామని ఇద్దరికీ తెలుసు. అయితే కేసీఆర్ మీద ఓడిపోతే గౌరవంగా ఉంటదని పోటీచేస్తూ ఉండొచ్చు. వారి పార్టీల్లో వారి వ్యక్తిగత పరపతి పెంచుకోవటం కోసం తాపత్రయం కోసం మాత్రమే పోటీచేస్తున్నరు. అంతేతప్ప మరోటి లేదు. కొడంగల్లో చెల్లనిరూపాయి రేవంత్రెడ్డి, కామారెడ్డిలో ఎట్లా చెల్లుతడు? నరేంద్రెడ్డి మీద రేవంత్రెడ్డి మరోసారి ఓడిపోతే బాగోదని కామారెడ్డి నుంచి, కౌశిక్రెడ్డి మీద ఓడిపోతే బాగుండదని ఈటల రాజేందర్ పోటీచేస్తున్నరు.
బీఆర్ఎస్ త్రీలో మీ ప్రణాళిక ఎలా ఉండబోతున్నది?
2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వదేండ్లవుతది. ఆ సంవత్సరం నాటికి తెలంగాణ ఎలా ఉండాలి అన్నది టార్గెట్గా పెట్టుకొని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహారచనతో ముందుకు సాగుతున్నాం. తెలంగాణతో బీఆర్ఎస్కు తాత్కాలిక రుణానుబంధం కాదు. వందేండ్ల స్వాతంత్య్ర దినోత్సవం నాటికి తెలంగాణ ఎక్కడుండాలె? ఎట్లా ఉండాలె? పదేండ్లల్లో తెలంగాణ ఎక్కడుండాలె? 20 ఏండ్లల్లో ఎక్కడుండాలె? అనే స్పష్టమైన వ్యూహం ఉన్నది. రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా ఆవిష్కరించుకుంటూ వెళతాం. ఉదాహరణకు ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అన్నాం. ఇప్పటి దాకా నియామక ప్రక్రియలో చిన్నచిన్న తప్పులను సవరించుకొని ముందుకు వెళతాం. కానీ, ఈ తొమ్మిదిన్నరేండ్లకాలంలో ఏం చేశామో కూడా చూడాలి.