బోయిన్పల్లి: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆగలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఊహించని అభివృద్ధి జరుగుతోందని అన్నారు. తెలంగాణను, తెలంగాణ ప్రజలను కేసీఆర్ ప్రేమించినంత ఎవరూ ప్రేమించరు అని పేర్కొన్నారు. కొదురుపాకలో రైతువేదికను మంత్రి ప్రశాంత్రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. కేడీసీసీ బ్యాంకు, విలాసాగర్ ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం కొదురుపాక జంక్షన్ రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ వంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు. నోరుందని ప్రతిపక్షాలు ఎటుబడితే అటు మాట్లాడితే చెల్లదు. రైతులు పండించిన ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వరిధాన్యం పండించడంలో దేశంలోనే నెంబర్వన్ తెలంగాణ. రైతు వేదికలో నిత్య చైతన్య జ్వాల వెలగాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష. రైతుల కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకునేలా రైతువేదికలు ఉపయోగపడాలని’ మంత్రి తెలిపారు.
‘తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్మానేరు గుండెకాయలా మారింది. వేములవాడ-మిడ్మానేరును కలిపి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా. ఒకప్పుడు సిరిసిల్ల జిల్లా కరువు ప్రాంతం. సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ఈ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. తెలంగాణ తప్పా దేశంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు జరగలేదు. కరోనా కష్టకాలంలో కూడా ధాన్యం కొనుగోలు జరిగిందని’ కేటీఆర్ వివరించారు.