మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన కన్నుపడిన భూమినల్లా కబ్జా చేసినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా దేవరయాంజాల్లో ఓ మహిళ భూమిని సైతం దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్టు తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్కు మరో ఫిర్యాదు అందింది. ఈటల భార్య, అనుచరుల పేరిట పక్కనే ఉన్న సర్వే నంబర్ పత్రాలను ఆధారంగా సదరు మహిళ భూమిని ఆక్రమించుకోవడంతోపాటు ఆమె భర్తపైనే ఉల్టా కేసు పెట్టారు. దీంతో బాధితురాలు గతేడాది ఆగస్టు నుంచి పోలీసు, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేస్తూ తన భూమిని కాపాడుకొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలతో మేడ్చల్ కలెక్టర్కు సదరు మహిళ చేసిన ఫిర్యాదు కాపీ ‘నమస్తే తెలంగాణ’ చేతికి చిక్కింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలోని దేవర యాంజాల్లోని సర్వే నంబర్ 217లో శిరీన్ సేత్నా బరియా అనే మహిళకు 15.09 ఎకరాల భూమి ఉన్నది. దీనిని 1999లో ఆమె కొనుగోలు చేశారు. ఆ మేరకు సేల్ డీడ్ నంబర్ 7291/99, తేదీ.25.3.1999 కూడా ఉన్నది. ఈ సర్వే నంబర్కు ఆనుకొని ఉన్న 231 సర్వే నంబర్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున పేరిట మూడెకరాల భూమి ఉన్నది. ఆమెతోపాటు ఈటల ప్రధాన అనుచరుడైన బచ్చంగారి లక్ష్మీనారాయణరెడ్డికి కూడా ఇదే సర్వే నంబర్లో మరో మూడెకరాలు ఉన్నది. దీంతో ఈటల కన్ను శిరీన్ సేత్నా బరియా భూమిపై పడింది. ఇంకేముంది.. మంచిరోజు చూసుకొని ఈటల అనుచరులు లక్ష్మీనారాయణరెడ్డి, సూరి ఆ భూమిని ఆక్రమించుకొని ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు.
ఈటల ఈ భూమిపై కన్నేసి.. తన అనుచరులతో ఓ ప్రణాళిక ప్రకారం దానిని ఆక్రమించుకున్నారు. గత ఏడాది ఆగస్టు 5న బాధిత మహిళ భర్త పర్వేజ్ బరియాపై పేట్ బషీర్బాగ్లో లక్ష్మీనారాయణరెడ్డి కేసు పెట్టారు. దౌర్జన్యంగా తమ భూమిలోకి ప్రవేశించి, ఫెన్సింగ్ను తొలగించారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరుసటి రోజు పర్వేజ్ను స్టేషన్కు పిలిపించారు. దీంతో తన భర్తతోపాటు ఠాణాకు వెళ్లిన శిరీన్ పోలీసులకు తమ భూమి ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపి, వాస్తవాలను వివరించారు. దీంతో సుదీర్ఘ చర్చ తర్వాత ఇరువర్గాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. రెండు సర్వే నంబర్లకు సంబంధించి రెవెన్యూ సర్వే నిర్వహించి, హద్దులు నిర్ధారించుకోవాలని, అప్పటివరకు ఎవరూ ఇతరుల భూమిలోకి ప్రవేశించవద్దనే అంగీకారానికి వచ్చి.. ఆ మినిట్స్పై లక్ష్మీనారాయణరెడ్డి, శిరీన్ సంతకం చేశారు. ఇలా అంగీకరించిన రెండు రోజుల్లోనే అంటే ఆగస్టు 8న లక్ష్మీనారాయణరెడ్డి, ఈటల మరో ప్రధాన అనుచరుడైన సూరితోపాటు 20మంది శిరీన్ సేత్నా భూమిలో జేసీబీల సాయంతో కడీలు పాతి ఫెన్సింగ్ వేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో శిరీన్ సేత్నా అక్కడికి వెళ్లి ఈ దౌర్జన్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పేట్ బషీర్బాగ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్సై జీ శ్రీనివాస్ సైట్ మీదికి వెళ్లి ఫెన్సింగ్ ఏర్పాటును నిలిపివేయాలని చెప్పడంతో అప్పటికి ఆపారు.
సర్వే చేసి అధికారికంగా హద్దులు ఏర్పాటుచేస్తే తన భూమి తనకు దక్కుతుందని శిరీన్ సేత్నా ఆగస్టు 12న శామీర్పేట తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోను కలిశారు. వెంటనే చేయిస్తానని దరఖాస్తు స్వీకరించిన ఎమ్మార్వో హామీ ఇచ్చినప్పటికీ సర్వే పూర్తి చేయలేదు. ఇదే అదునుగా ఈటల అనుచరులు లక్ష్మీనారాయణరెడ్డి, సూరి.. 217 సర్వే నంబర్లోని 15.09 ఎకరాల్లోని అత్యధిక భాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని ఆక్రమించుకున్నారు. ఆగస్టు 25న తన భూమిలోకి వెళ్లేందుకు యత్నించిన శిరీన్ సేత్నాను అడ్డుకున్నారు. సర్వే అయ్యేంతవరకు ఎలాంటి చర్యలకు దిగబోమని అంగీకరించి, దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకోవడం ఏమిటని ఆమె ప్రశ్నించినా వారు పట్టించుకోలేదు.
ఈటల భూ దౌర్జన్యంతో విసిగిపోయిన శిరీన్ సేత్నా తిరిగి పేట్ బషీర్బాగ్ పోలీసులను ఆశ్రయించారు. తాను ఆగస్టు 8న ఇచ్చిన ఫిర్యాదు పరిస్థితిని పరిశీలించగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేయకుండా కేవలం సీడీ ఎంట్రీ మాత్రమే చేశారు. లక్ష్మీనారాయణరెడ్డి, సూరి, ఇతరుల దౌర్జన్యంపై ఫిర్యాదుచేసినా కేసు నమోదు ఎందుకుచేయడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేసిన బాధితురాలు.. తిరిగి ఆగస్టు 25న మరోసారి ఫిర్యాదుచేశారు. పలుమార్లు పోలీసులను కోరితే.. చివరకు సెప్టెంబర్ 30న లక్ష్మీనారాయణరెడ్డి, సూరి, ఇతరులపై కేసు (ఎఫ్ఐఆర్ నం. 680/2020) నమోదుచేశారు. సర్వేచేయాల్సిందిగా రెవెన్యూశాఖకు సూచించారు. సెప్టెంబర్ 17న సర్వేయర్ వచ్చి సర్వేచేశారు. నవంబర్ 11న మరోసారి కూడా భూమిని పరిశీలించారు. హద్దులు మాత్రం నిర్ధారించలేదు. దీంతో బాధితురాలు ఈ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ ఈ నెల 8న మేడ్చల్ కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. ముఖ్యంగా పార్సీ జొరాస్ట్రియన్ కమ్యూనిటీకి చెందిన మహిళనైన తన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడంతోపాటు తన భర్తపై అక్రమంగా కేసు కూడా పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వే పూర్తిచేసి, హద్దులు ఏర్పాటుచేసిన తనకు న్యాయంచేయాలని కోరారు.