హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్కు రైతుబంధు నగదు పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. దాదాపు కోటిన్నర ఎకరాలలో పంట పెట్టుబడికోసం రూ.7508 కోట్లను ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయనున్నది. నగదు సహాయం మొత్తం రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నది. మొత్తం 63,25,695 మంది రైతులకు రైతుబంధు అందించనున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 25 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన నిధులను సమకూర్చింది. గత యాసంగితో పోల్చితే ఈ సీజన్లో 2,81,865 మంది రైతులు కొత్తగా రైతుబంధుకు అర్హత సాధించారు. అంతేకాకుండా 66,311 ఎకరాలు భూమి పెరగడం గమనార్హం. ఈ సీజన్లో నల్లగొండలో ఎక్కువ మంది రైతులకు రైతుబంధు అందనుండగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లాలో 4,72,983 మంది అర్హులైన రైతులు ఉండగా వీరికి 12.18 లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఈ ఒక్క జిల్లాకే ఏకంగా రూ.608.81 కోట్లు అందనున్నాయి. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 77 వేల ఎకరాలున్న 39,762 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ. 38.39 కోట్లు అందనున్నాయి.
నేడు ఒక ఎకరం రైతులకు..
రైతుబంధు పంపిణీని క్రమబద్ధంగాచేయాలని అధికారులు నిర్ణయించారు. ఎకరం భూమి గల రైతులకు తొలిరోజు (మంగళవారం) రైతుబంధు నిధులు విడుదల చేస్తారు. ఆ తర్వాత రెండెకరాల భూమి గల రైతులకు ఇస్తారు. 25వ తేదీ వరకు అర్హులైన ప్రతిరైతుకు రైతుబంధు అందిస్తారు.
వరుసగా ఏడోసారి…
రైతుకు పెట్టుబడి గోస తీర్చాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బృహత్తరమైన రైతుబంధు పథకం ఆది నుంచే విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ సీజన్తో కలిపి ఇప్పటి వరకు ఏడు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం అందించారు.
2018 వాననాకాలం సీజన్లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టే నాటికి దేశంలో మరెక్కడా ఇలాంటి పథకం లేదు. ఆ తర్వాత మన రైతుబంధును ఆదర్శంగా తీసుకొని కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు వివిధ పేర్లతో రైతుకు పెట్టుబడిసాయం అందిస్తున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో రైతుకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్.. ఎవుసం సాఫీగా సాగేందుకు, పెట్టుబడి కోసం రైతు గోస పడకుండా చూసేందుకు రైతుబంధు నిధులను సీజన్కు ముందే అందిస్తున్నారు. గతేడాది నుంచి కరోనా విజృంభణతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో రైతుబంధు నిధులు వస్తాయో లేదోనన్న సందేహం చాలామందిలో వ్యక్తమైంది. కానీ కరోనా కష్టాలు తీవ్రంగా వెంటాడుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం వెనుకంజ వేయలేదు. రైతుల శ్రేయస్సే ముఖ్యమంటూ.. సకాలంలో రైతుబంధు నిధులు అందించారు. తద్వారా రైతుల పట్ల తనకున్న మమకారాన్ని మరోసారి చాటుకున్నారు.