హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పత్తి పంట వర్షాధారంగా పండిస్తున్నా రు. కానీ నీటి పారకం ద్వారా సాగుచేస్తే రెట్టింపు దిగుబడి వస్తుందని, లాభాలు అధికంగా ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో ప్రాజెక్టులు పూర్తయ్యాయి. నదుల నీళ్లు చెరువులను నింపుతున్నాయి. దీంతో ఎర్రటి ఎండల్లో నూ మత్తళ్లు దుంకుతున్నయి. ఈ పరిస్థితుల్లో వాణిజ్య పంటయిన పత్తిని పండిస్తే రైతు లాభాలబాట పట్టడం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగు శ్రేయస్కరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రభు త్వం కూడా రెండేండ్లుగా పత్తిసాగును ప్రోత్సహిస్తున్నది. గత వానకాలంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, ఈ సీజన్లో 80 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. ప్రస్తుతం వరంగల్, ఆదిలాబాద్, జోగుళాంబ గద్వాల, మహబూబ్నగర్, జనగామతోపాటు మరికొన్ని జిల్లాల్లో కేవలం 20-25 శాతం రైతులు నీటి పారకంతో పత్తి సాగుచేసి మంచి దిగుబడి సాధిస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా నీటి పారకంవిధానంలో పత్తి సాగుచేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
రోజూ నీళ్లు పెట్టే పనిలేదు
వర్షాధార సాగులో మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10-12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. కానీ.. నీటి పారకం ద్వారా సాగుచేస్తే ఎకరాకు 18-20 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పత్తి నాణ్యత కూడా పెరుగనుంది. రాష్ట్రంలో పత్తి గింజ పొడవు కూడా ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఒకటో కటింగ్లోనే నాణ్యమైన పత్తి వస్తుంది. రెండు, మూడు కటింగ్లో నాణ్యత, గింజ పొడవు తగ్గుతుంది. నీటి పారకంలో రెండు, మూడో కటింగ్లోనూ నాణ్యమైన పత్తి వస్తున్నది. నీటి పారకంలో పత్తి సాగు అంటే.. రోజూ నీరు పారించాల్సిన అవసరం లేదు. పూత, కాత సమయంలో నేలరకాన్ని బట్టి వారం నుంచి పది రోజులకోసారి పారిస్తే సరిపోతుంది. వర్షాలు బాగుంటే అది కూడా అవసరం ఉండదు. 10-15 రోజులు వర్షం పడనప్పుడే నీళ్లు పారించాలి. నల్లరేగడి నేలల్లో 10-12 రోజులకోసారి, ఎర్రనేలల్లో వారానికోసారి నీళ్లు పారించాలి. పూత, కాత దశలో నీళ్లుపారిస్తే కాయ బలిష్టంగా ఉండి.. ఎక్కువ కాయడంతో పాటు నాణ్యంగా ఉంటుంది. అధికంగా నీళ్లుపెట్టినా చీడపీడల బెడద ఉంటుంది. పత్తి సాగుచేసిన నేలలు నెర్రలు పారకుండా చూసుకోవాలి. స్ప్రింక్లర్స్ ద్వారా కాకుండా డ్రిప్ ద్వారా లేదా కాలువల ద్వారానే నీరు పారిస్తేనే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
జూన్లో విత్తటమే మేలు
రాష్ట్రంలో నీటివనరులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో జూన్ మొదటి వారంలోనే పత్తి విత్తనాలు వేసుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రెండో వారంలో విత్తుకుంటే, మొలకెత్తే శాతం పెరగడంతోపాటు చీడపీడల బాధ తగ్గి, దిగుబడి పెరుగుతుంది. జూలై 15-20 వరకు వెళ్తే పంటపై ప్రభావం ఉంటుంది. ఆసల్యమైన కొద్దీ వర్షాలు తగ్గడం వల్ల పంట దెబ్బతింటుంది. డిసెంబర్ దాటితే గులాబీరంగు పురుగు సోకడం ప్రారంభమవుతుంది. త్వరగా విత్తుకుంటే డిసెంబర్లోగా పంట పూర్తవుతుం ది. తర్వాత రెండోపంటగా ఇతర పంటలను వేసుకోవచ్చు. దీంతో అదనపు ఆదాయంతోపాటు భూసారం పెరుగుతుంది. పత్తిలో కంది వంటి అంతర పంటను సాగుచేస్తే మంచిది.
నీటిపారకం ద్వారా పత్తి సాగే మంచిది
వర్షాధార విధానంతో పోల్చితే నీటిపారంతో పత్తి సాగుచేస్తే దిగుబడి రెట్టింపు వస్తుంది. దీంతో పాటు పత్తి నాణ్యత కూడా పెరుగుతుంది. రాష్ట్రంలో సాగు నీటివనరులు పెరిగిన నేపథ్యంలో మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో పత్తి విత్తనాలు వేస్తే మంచి పంట వచ్చే అవకాశం ఉంటుంది.
-సుదర్శన్, రిటైర్డ్ ప్రధాన శాస్త్రవేత్త, వరంగల్