రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల విలువ చేసే డబుల్బెడ్రూం ఇండ్లను పేదలకు ఉచితంగా, ఎలాంటి పైరవీలు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఇందిరానగర్కాలనీలో రూ.17.85 కోట్ల వ్యయంతో నిర్మించిన 210 డబుల్బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ మహానగరంలో లేనివిధంగా హైదరాబాద్లో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్లను వ్యయం చేయగా హైదరాబాద్లోనే రూ.9,714 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. పేదలు చిరునవ్వుతో ఆత్మ గౌరవంతో బతకాలనేది సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. కొల్లూరులో 112 బ్లాక్ల్లో 15,600 గృహాలతో నిర్మిస్తున్న ఆసియాలోనే అతి పెద్ద హౌసింగ్కాలనీని త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
తెలంగాణతో పాటు నేతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 8వ బడ్జెట్లోనూ రాష్ర్టానికి, చేనేత కార్మికులకు అన్యాయం చేసిందని విమర్శించారు. ఏడున్నరేండ్లుగా ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. దున్నపోతు మీద వాన పడ్డ చందంగా కేంద్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మార్కండేయ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం టెక్నాలజీ ఇవ్వాలని అడిగాం. వరంగల్ మెగా టెక్స్టైల్స్ పార్కుకు సాయం చేయాలని కోరాం. 11 చేనేత క్లస్టర్లు, సిరిసిల్లలో మెగా పవర్లూం క్లస్టర్ మంజూరు చేయాలని ఏడున్నరేండ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేదు’ అని కేంద్రం వైఖరిని దుయ్యబట్టారు. నష్టం జరుగుతున్నప్పుడు ఆలోచించకపోతే లాభం లేదని, తర్వాత బాధ పడితే ఉపయోగం లేదని అన్నారు.
ఈ సందర్భంగా ‘పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్లు తప్ప’ అన్న కారల్మార్క్స్ నినాదాన్ని గుర్తుచేశారు. వస్త్ర పరిశ్రమను దెబ్బతీసేలా విధించిన జీఎస్టీ ఇంకా బంద్ కాలేదని, ఐదు రాష్ర్టాల ఎన్నికల కోసం తాత్కాలికంగా పక్కన పెట్టిందని అన్నారు. నేతన్నలకు చేయూత ఇవ్వాలన్న సోయి కేంద్రానికి లేకపోవడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేనేత, మరమగ్గాల పరిశ్రమకు దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అమలు చేస్తున్నదని వివరించారు. పొట్టకూటి కోసం వలస వెళ్లిన కార్మికులను తిరిగి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, చేనేత, మరమగ్గాలను ఆధునీకరిస్తూ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నదని వివరించారు. కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కేంద్రం తనవంతు సాయం చేస్తే వస్త్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదని చెప్పారు. కానీ, కేంద్రం ఏ మాత్రం సహకరించకుండా దుర్మార్గంగా వ్యవరిస్తున్నదని మండిపడ్డారు.