మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీలో అన్నయ్య అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత అందరివాడు కాస్త కొందరివాడు అయ్యాడు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావడంతో ఆయన అందరివాడు అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. దానికోసం అందరితో కలిసిపోతున్నాడు. ఇండస్ట్రీలోని వాళ్లు కూడా చిరంజీవిని రెండు చేతులా ఆహ్వానిస్తున్నారు. అందరూ ఆయన సాయం కోరి వెళ్తున్నారు. ఆయన పెద్దరికాన్ని తమ సినిమాల కోసం వాడుకుంటున్నారు. చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మెగా ఇమేజ్ వాడుతున్నారు. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా ఫంక్షన్ ఏదైనా అందులో చిరంజీవి ఉండాలి అంటున్నారు. తాజాగా ఆయన చేతుల మీదుగా విరాటపర్వం టీజర్ విడుదల చేయడమే ఉదాహరణగా చెప్పొచ్చు.
వారం రోజుల కింద నాగార్జున తన వైల్డ్ డాగ్ ట్రైలర్ చిరంజీవితోనే విడుదల చేయించాడు. దానికి ముందు శర్వానంద్ శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి చీఫ్ గెస్ట్గా వచ్చాడు. త్వరలోనే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. అందులోనూ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నాడు. ఇప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగినా కూడా దానికి అందరి కంటే ముందు చిరంజీవి పేరు వినిపించడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకప్పుడు దాసరి నారాయణరావు ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఫంక్షన్కు వచ్చేవాడు. ఆయనను ప్రతి ఒక్కరూ ఆహ్వానించే వాళ్లు. తమ సినిమా ఫంక్షన్కు వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పాలని కోరుకునేవాళ్లు. ఆయన పెద్దరికాన్ని గౌరవించేవారు.
దాసరి పోయిన తర్వాత ఆ కుర్చీ అలాగే ఉండిపోయింది. ఇప్పటికే అలాగే ఖాళీగా కనిపిస్తోంది. అందులో చిరంజీవిని కూర్చోబెట్టాలని ఇండస్ట్రీలో చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన మాత్రం కుర్చీకి దూరంగా ఉంటూ.. పెద్దరికాన్ని మాత్రం నిలబెట్టుకుంటున్నాడు. అందుకే ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగినా కూడా అక్కడ మెగాస్టార్ ప్రత్యక్షమవుతాడు. ఎవరు పిలిచినా కూడా కాదనకుండా వస్తున్నాడు. చిన్న సినిమాలకు తన సపోర్ట్ అందిస్తున్నాడు. పెద్ద సినిమాలకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాడు. మొత్తానికి ఎలా చూసుకున్నా కూడా చిరంజీవి ఇప్పుడు అందరివాడు అయిపోతున్నాడు.