స్వచ్ఛమయంగా మారిన గ్రామం
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు
వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం
అందుబాటులోకి డంపింగ్ యార్డు, వైకుంఠధామం
రోడ్లకు ఇరువైపులా పచ్చదనం
నిత్యం ఇంటింటా చెత్త సేకరణ
చిలిపిచెడ్, మార్చి 28 : పల్లెలన్నీ సకల సౌకర్యాలతో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టగా నేడు సత్ఫలితాలు వస్తున్నాయి. మండలంలోని గౌతాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన ప్రగతి పనులతో గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిం ది. డంపింగ్యార్డు, వైకుంఠధా మం అందుబాటులోకి వచ్చిం ది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. అంతర్గత రోడ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. నిరంతరం విద్యుత్ సరఫరా అందుతుంది. గత నెలలో పల్లె ప్రగతిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక చరిత్రలో నిలిచిపోనుంది. ఇన్నాళ్లు గ్రామీణ ప్రజలను వెంటాడిన దీర్ఘకాలిక సమస్యలకు పల్లె ప్రగతి చరమగీతం పాడుతుంది. ఊరూరా ప్రమాదకరంగా ఉన్న పాడుబడిన బావుల పూడ్చివేత, శిథిలమైన ఇండ్ల కూల్చివేత పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. గ్రామంలో పనిచేయని బోర్లతోపాటు లోతట్టు ప్రాంతాలను సైతం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పూడ్చి వేశారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న 12 ఇండ్ల గుర్తించి కూల్చివేశారు. 5 ప్రమాదకర బావులను గుర్తించి వాటిని మట్టితో పూడ్చివేశారు. 11 కరెంట్ స్తంభాలను కొత్తగా ఏర్పాటు చేశారు. గ్రామంలో కిందకు వేలాడి విద్యుత్ తీగలను సరిచేశారు. గ్రామంలో ఉన్న ప్రధాన రోడ్లకు ఇరువైపులా కలుపు మొక్కలను తొలిగించి మొక్కలు నాటారు. నాటిన మొక్కలకు 436 ట్రీగార్డు ఏర్పాటు చేశారు. ఉపా ధి హామీ సిబ్బంది శ్రమదానం నిర్వహిస్తూ పల్లెల అభివృద్ధికి చేయూతనందిస్తున్నారు. ఇటువంటి పనులను ఎప్పుడూ చూడలేదని గ్రామ స్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటింటా చెత్త సేకరణ..
తడి, పొడి చెత్త సేకరణ కోసం ఇంటింటికీ చెత్త బుట్టలు అందించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ ద్వారా ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించి గ్రామ శివారులో రూ.2.50 లక్షలతో నిర్మించిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు పోస్తున్నారు.
ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనం..
గ్రామంలోని ఎకర స్థలంలో రూ.3 లక్షలతో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అందులో 12 వేల మొక్కలతోపాటు సుమారు 15 రకాల పండ్ల మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనం ఆకర్షణీయంగా కనిపిస్తున్నది.
సీసీ రోడ్లతో తీరిన బురద ఇబ్బందులు..
ఎమ్మెల్యే మదన్రెడ్డి చొరవతో రూ.20 లక్షలతో 485 మీటర్ల సీసీ రోడ్లు వేశారు. ప్రతి సీసీ రోడ్లు పక్కన డ్రైనేజీ కాల్వలు ఉండేలా పంచాయతీ సిబ్బంది ఏర్పా టు చేశారు. గ్రామంలో వైకుంఠధామం 80 శాతం పూర్తయ్యాయి.
మిషన్ భగీరథ రెండు వాటర్ ట్యాంకులు..
గ్రామంలో 1.20 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు మిషన్ భగీరథ నీటి ట్యాంకులను ప్రభుత్వం నిర్మించింది. ప్రతిరోజూ గ్రామస్తులకు భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆవు పాలకి, బర్రె పాలకి మధ్య తేడా ఏంటి?
కొత్తిమీరే కదా అని తీసి పారేయకండి