మేడ్చల్, మే19(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో గర్భిణుల వైద్యసేవల కోసం మేడ్చల్ జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గర్భిణులు ఇబ్బందులు పడకుండా సులువుగా వైద్యసేవలు పొందేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గర్భందాల్చినప్పుడు, కాన్పుల సమయంలో కొవిడ్ బాధితులకు, నవజాత శిశువులకు ఏఏ కేంద్రాల్లో సేవలు అందుతాయి, ఎక్కడ పరీక్షలు నిర్వహిస్తారు, కాన్పులు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల వివరాలు, అత్యవసర అంబులెన్స్ సేవలు… తదితర వివరాలు తెలియజేసేందుకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశాల మేరకు ఈ హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు. వైద్య సేవల కోసం ఫోన్: 7382471061-7382482399లకు సంప్రదించాలని కోరారు. హెల్ప్లైన్ కేంద్రం ద్వారా నిరంతరం వైద్య సేవలు అందిస్తాం అని తెలిపారు. బుధవారం వైద్య సేవల కోసం 12 మంది గర్భిణులు ఫోన్ చేశారని వైద్య సిబ్బంది తెలిపారు.