హైదరాబాద్: దేశంలో కొవిడ్ టీకాల కొరతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, సామర్థ్యానికి తగినట్లుగా రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా లేదని తెలిపారు. “ఆస్క్ కేటీఆర్” పేరుతో ఆదివారం సాయంత్రం ట్విటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. వివిధ అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వివిధ ప్రశ్నలకు కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే..
వ్యాక్సిన్ల తయారీకి హబ్గా ఉన్న ఇండియాలో డిమాండ్-సరఫరా మధ్య అంతరం ఎందుకు ఉంది? దేశంలో టీకాల కొరతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిగతా దేశాలన్నీ 2020 మొదట్లోనే వ్యాక్సిన్ల కోసం ఆర్డర్లు ఇస్తుండగా, భారత ప్రభుత్వం మాత్రం ఆలస్యంగా మేల్కొంది. మన దేశం జనవరి 2021లో టీకాలు కోసం ఆర్డర్లు ఇచ్చింది.
డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఆలస్యమవుతోంది. అమెరికా, కెనడా, డెన్మార్క్, నార్వే వంటి విదేశాల్లో 50 కోట్లకు పైగా కోవిషీల్డ్ డోసులు నిరుపయోగంగా ఉన్నాయి. మిగులు టీకాలు ఉన్న దేశాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి వేగంగా వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా రాష్ట్రాలకు టీకాల సరఫరా పెంచాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వ్యాక్సిన్ల వృథా చాలా తక్కువగా ఉంది.
సాధ్యమైనంత త్వరగా అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ వేస్తాం. పిల్లల వ్యాక్సిన్లకు ఇంకా ఆమోదం రాలేదు. పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. వ్యాక్సిన్ల కోసం బడ్జెట్లో రూ.35వేల కోట్లు కేటాయించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 100శాతం జనాభాకు వ్యాక్సిన్ వేయాల్సి వస్తే 272 కోట్ల డోసులు అవసరం అవుతాయి. ఒక్కో డోసును రూ.150 కొనుగోలు చేస్తామని చెప్పింది. ఆ కేటాయింపులు ఇప్పుడు ఎక్కడికి పోయాయో తెలియట్లేదు.
వీలైనంత వేగంగా అందరికీ వ్యాక్సిన్ వేయడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు ఎటువంటి స్పందన రాలేదు. నా అభిప్రాయం ప్రకారం వయసుల వారీగా టీకాలు వేయడం సరికాదు. వ్యాప్తి ఎక్కువ అవకాశమున్న వారికి ముందుగా వ్యాక్సిన్ వేయాలి. కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్నవారిని గుర్తించి టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తున్నాము.
విదేశీ సంస్థలు టీకాలను కేంద్రానికే ఇస్తామంటున్నాయి. టీకాల కోసం గ్లోబల్ టెండర్ల కోసం వెళ్లిన రాష్ట్రాలకూ నిరాశే మిగిలింది. కేంద్రం సరైన సమయంలో వ్యాక్సిన్ల ఆర్డర్ ఇవ్వకపోవడం సమస్యగా మారింది. టీకాలు ఉన్నప్పుడు కేంద్రం ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. ఫైజర్ సంస్థ గతేడాది చివరలో భారత్లో టీకా అనుమతి కోరితే ఈ ఏడాది జూన్ 1న అనుమతి ఇచ్చారు.