హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించి, సిరిసిల్లను సంపూర్ణ సస్యశ్యామల జిల్లాగా తయారు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి, సాగునీటి శాఖ అధికారులకు మంత్రి కే. తారకరామారావు బుధవారం దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో రాష్ట్రస్థాయి సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా శాసన సభ్యులతో మంత్రి బుధవారం సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ మేరకే సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించేలా ప్రయత్నం చేద్దామన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతో జిల్లాలో భారీ ఎత్తున వ్యవసాయ సాగు పెరిగిందన్నారు. అయితే ప్రస్తుతం మిగిలిపోయిన పనులను పూర్తి చేయడం ద్వారా వ్యవసాయ సాగుని సంపూర్ణం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
జిల్లాలో ఉన్న ప్రతి చెరువుని నింపడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సాగునీటి వనరులు అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించిన సూక్ష్మస్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని, ఈ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు, రైతాంగం సూచనలను సైతం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా పరిధిలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం, నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, సుంకే రవికుమార్ తదితరుల నుంచి క్షేత్రస్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పనుల్లో అతి త్వరగా పూర్తయ్యే పనుల పైన దృష్టిసారించి, వాటిని పూర్తిచేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామస్థాయిలో నీటి వనరులు వాటి కింద ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలతో కూడిన ఒక సమగ్ర నివేదికను తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, పలువురు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.