నాకు అత్యంత ఆత్మీయమైన గురువు, గైడ్ తిరునగరి సార్. నాలాంటి వందలాది మందికి తెలుగు టీచర్, మంచి గైడ్, గొప్ప సాహితీవేత్త. తెలుగులో పద్యం, గద్యం, వచన కవిత్వ రచనలో అందె వేసిన చేయి. నిరంతర కవితా కృషీవలుడు. ‘కవిత రాయకుండా కాలం గడవదయ్య నాకు’ అనేవాడు. వేలాది కవితలు, పద్యాలు, సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు, నాలాంటి వారి కవితా సంకలనాలకు ముందుమాటలు. ఇంత విరివిగా రాసిన సాహితీవేత్తలు అరుదు. రావలసినంత పేరు వచ్చినా, చెప్పుకోదగిన సన్మాన, సత్కారాలెన్ని జరిగినా, అతిశయాలు లేని మనిషి.
తిరునగరి సార్ ధారణాశక్తి అద్భుతమైంది. వందలాది పుస్తకాల నుంచి కొటేషన్స్ చెప్పడం ఆయన ఉపన్యాసాల ప్రత్యేకత. వేలాది పద్యాలు, వందలాది కవులు, రచనలు అడిగిందే తడవుగా వివరించేవారు. తెలుగు సాహిత్యాన్ని ఎంత అవలోకనం చేశాడో. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలను అంతగా ఆకళింపు చేసుకున్న అధ్యయనశీలి. తన కవిత్వంలో మనిషే జెండా. మానవత్వమే ఎజెండా. నాకు తెలిసిన యాభై ఏండ్లనుంచి తిరునగరి సార్ సాహిత్య సృజన చేస్తున్న వచనా కవితా కవి, పద్యకవి.
ముప్పైకి మించిన కవిత్వ సంకలనాలు. వివిధ పత్రికల్లో అచ్చయినవి వేయికి పైగా సాహిత్య వ్యాసాలు. పాటలుకూడా రాశారు. వందల లలిత గీతాలు, దేశభక్తి గేయాలు, ప్రబోధాత్మకమైన పాటలు రచించారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలనుంచి ఈ పాటలు ప్రసారమైనవి. కనీసం వేయి సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాల్లో వక్తగా పాల్గొన్నారు. అడుగడుగునా కొటేషన్లతో ఉపన్యాసాన్ని రక్తి కట్టించడంలో ఆయనకాయనే సాటి. సందర్భోచిత ప్రసక్తి తేవడం ఆయన ప్రత్యేకతలు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల (1971) సభలో దాశరథి గారు ప్రసంగిస్తూ తన పద్యం ‘నా గీతావళి ఎంతదూరం ప్రయాణంబగునో’ వినిపిస్తూ .. ఆ సభావేదికపై ఉన్న తిరునగరి సార్ను చూసి ‘ఇదిగో నా పద్యాలన్నీ కంఠతావచ్చు తనకు, నా పద్యం అందుకోవయ్యా’ అన్నాడు. వెంటనే తిరునగరి సార్ ఆ పద్యం అందుకొని మొత్తం వినిపించాడు సభలో. 1972లో నేనప్పుడు 10వ తరగతి. నాతో దాశరథి గారు తనను ఒంగోలు అభ్యుదయ రచయితల సభకు వెంట తీసుకెళ్తున్నాడని, తాను ఆ సభలో మాట్లాడబోతున్నాన’ని చెప్పాడు. తిరిగి వచ్చాక తిరునగరి సార్ అధ్యక్షతన లింగంపల్లి రామచంద్రసార్, నేను, మరికొంతమంది మిత్రులతో ఆలేరు అభ్యుదయ రచయితల సంఘం శాఖ ఏర్పాటు చేయించాడు. నేను కార్యదర్శిగా ఉన్నాను.
దాశరథిగారు ‘తిరునగరి కవితలు తేజస్వంతాలు, ఓజస్వంతాలు’ అన్నారు. ఆయన అపారమైన ఉపన్యాస వాగ్ధారను పదేపదే మెచ్చుకునేవారు. దాశరథి, అనిసెట్టి సుబ్బారావు తెలంగాణలో తిరిగి అభ్యుదయ రచయితల సంఘశాఖలను ఏర్పాటు చేస్తూ, అనేక పట్టణాల్లో సభలు నిర్వహించారు. అట్లాంటి సభ జనగామ వేణుగోపాలస్వామి గుడిలో జరిగినపుడు నేను, మిత్రుడు రాజేంద్రప్రసాద్, మరికొందరు రాసిన చిన్న కవితా సంకలనం ఉదయ కిరణాల’ను దాశరథి గారిచేత ఆవిష్కరింపజేశారు సార్. నాకు వచన కవితారచనలో మార్గదర్శి. సాహిత్య పఠనం చేయించాడు. కవితలు రాయించాడు. తనతోపాటు కవి సమ్మేళనాలకు తీసుకుని వెళ్లేవాడు. ఎందరో నాలాంటి విద్యార్థులను కవులుగా తీర్చిదిద్దాడు. నా కవితా సంకలనాలకు ముందుమాటలు రాశాడు. మేం పెట్టుకున్న ‘రచన సాహితీ కళావేదిక’ అనే సంస్థకు పెద్దదిక్కు తానే.
ఉద్యోగరీత్యా తెలుగు టీచర్గా, లెక్చరర్గా 30 ఏండ్లకు పైబడి పనిచేశారు. పాఠాలతో పాటు విద్యార్థుల జీవితాలను కూడా గైడ్ చేసేవారు. తిరునగరి సార్ సాహిత్యం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖవారు పరిశోధనలు చేశారు. కవిగా, వక్తగా, రచయితగా ప్రభుత్వ, ప్రభుత్వేతర పురస్కారాలనెన్నో అందుకున్నారు. గతేడాది తన వజ్రోత్సవ (75 ఏండ్ల) వయస్సులో తెలంగాణ ప్రభుత్వం చేత దాశరథి పురస్కారం అందుకున్నారు. తిరునగరి సార్ యాదాద్రి- భునవగిరి జిల్లా రాజపేట మండలంలోని బేగంపేట గ్రామంలో (ఆలేరులో కాదు) శ్రీమతి జానకిరామక్క, శ్రీ మనోహర్ దంపతులకు 1945 సెప్టెంబరు 24న జన్మించాడు. పూర్తి పేరు తిరునగరి రామానుజయ్య. ఎక్కువకాలం పనిచేసిన ఆలేరులోనే ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు. కొంతకాలం కిందట హైద్రాబాద్ చింతల్లో (హెచ్ఎంటీ)లోని గణేశ్నగర్లో విశ్రాంత జీవనం గడిపారు.
తిరునగరి సార్ రచనలు ‘బాలవీర’ శతకం, ‘శృంగార నాయికలు’ ప్రచురణలతో వెలుగులోకి వచ్చింది. పలు కవితా, పద్య సంకలనాలు అచ్చయినాయి. అన్నిట్లోనూ మానవత్వం తన కవితా వస్తువు. మానవ వేదనలను కవిత్వీకరించాడు. చాలా సరళమైన శైలి తనది. ‘కొవ్వొత్తి, వసంతం కోసం, అక్షరధార, గుండెలోంచి, మాపల్లె, మనిషి కోసం, వానా-వాడూ, ఈ భూమి, నీరాజనం, ప్రవాహిని, ఉషోగీత, జీవధార, ఒకింత మానవత కోసం, యాత్ర, కొత్త లోకం వైపు, కిటికిలోంచి, సముద్ర మథనం, జనహిత, చెమట నా కవిత్వం’ కవిత్వ సంకలనాలు, ముక్తకాలు, తిరునగరీయం పద్యసంపుటులు వెలువరించారు.
శ్రీరామోజు హరగోపాల్