ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం
జలమయమైన కాలనీలు, రోడ్లు
రెబ్బెనలో ఇళ్లలోకి చేరిన వరద
ఉప్పొంగిన వాగులు, వంకలు
గంటల కొద్దీ నిలిచిన రాకపోకలు
ఇబ్బందులు పడ్డ ప్రజలు
అక్కడక్కడా నీట మునిగిన పంటలు
నమస్తే బృందం, జూలై13 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం జోరువాన కురిసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. పలువురి ఇళ్లలోకి వరద చేరింది. కౌటాల, కెరమెరిలో మోస్తరు వర్షం కురిసింది. కాగజ్నగర్ మండలంలోని పెద్దవాగు నిండుగా ప్రవహిస్తున్నది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఎదుట వరద నిలిచిపోయింది. చెన్నూర్ మండలంలోని సుద్దాల వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. అక్కెపల్లి సమీపంలోని కెనాల్ నిండుగా ప్రవహించడంతో సుమారు నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. కత్తరశాల, సుబ్బరాంపల్లి, సంకారం వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ నుంచి జాతర్ల వెళ్లే మార్గంలో కోల్హారి వాగుపై గల లోలెవల్ వంతెన మునిగింది. రెండుగంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. సిరికొండ మండలం తిమ్మాపూర్, ఫకీర్నాయక్ తండా, రాంపూర్, కొండాపూర్ వాగులు ఉధృతంగా ప్రవహించాయి.
తుమ్మలపాడు వాగు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది. బోథ్ మండలంలో సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం మంగళవారం తెల్లవారు జాము వరకు కొనసాగింది. పెద్దవాగు, సొనాల వాగు, ధన్నూర్ (బీ) వాగు, నక్కలవాడ వాగుల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. వంతెనపైకి దుంగలు కొట్టుకు వచ్చి నిలిచిపోగా, వాటిని తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు. అందూర్ సమీపంలో ఒర్రెపై ఉన్న లోలెవల్ వంతెన వద్ద మట్టి మేటలు వేసింది. రేషన్ సరకుల కోసం వచ్చిన ఐదు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహాగావ్, గాదిగూడ, ఖడ్కి,లోకారి(కే) కల్వర్టులపై ఉధృతంగా వరద ప్రవహించడంతో మూడు గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. నార్నూర్లోని బారిక్రావ్గూడ, గాదిగూడలోని కునికసా,మారుగూడ గ్రామ సమీపంలోని వాగులు జోరుగా ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డాల్సి వస్తోంది. పలు మండలాల్లో పత్తి, కంది, సోయా తదితర పంటల్లోకి వరద చేరింది.