హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం తెలంగాణభవన్లో పలువురు నేతలతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1 గంటకే తెలంగాణభవన్కు చేరుకొన్న మంత్రి కేటీఆర్ సాయంత్రం 6 గంటల వరకు అక్కడే గడిపారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన ఉమ్మడి సమావేశం ముగిసిన తర్వాత కూడా దాదాపు రెండు గంటలపాటు ఆయన పలువురు నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 25న హెచ్ఐసీసీలో నిర్వహించనున్న ప్లీనరీ ఏర్పాట్లపై సమీక్షించారు. ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితో పలు అంశాలపై చర్చించారు. పార్టీ అధ్యక్ష పదవికి దాఖలైన నామినేషన్ల వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పర్యవేక్షకుడు పర్యాద కృష్ణమూర్తిని అడిగి తెలుసుకొన్నారు. జిల్లాలవారీగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బండా ప్రకాశ్, మాలోతు కవిత తదితరులు కేటీఆర్ను కలిసినవారిలో ఉన్నారు. వచ్చేనెల 15న వరంగల్లో తెలంగాణ విజయగర్జన బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతిరోజూ 20 నియోజకవర్గాల ముఖ్యనేతలతో సన్నాహక సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించడంతో కేటీఆర్ సంబంధిత జిల్లాల నేతలకు పలు సూచనలు చేశారు.