న్యూఢిల్లీ, జూన్ 7: కరోనా సెకండ్ వేవ్తో దేశీయ పరిశ్రమ సంక్షోభంలోకి జారుకున్నది. వైరస్ అదుపునకు ఆయా రాష్ర్టాల్లో అమలవుతున్న లాక్డౌన్లు, ఆంక్షలు.. సరఫరా వ్యవస్థకు ఇబ్బందిగా మారుతున్నాయి. దీంతో ముడి సరుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా వస్తూత్పత్తి తయారీ భారంగా మారుతున్నదని, ఈ క్రమంలో ఆర్థిక ప్రగతి కుంటుబడుతున్నదని తమ సర్వేలో తేలినట్లు వ్యాపార, పారిశ్రామిక సంఘం పీహెచ్డీసీసీఐ సోమవారం తెలిపింది. మొత్తం 34 రంగాల్లో ఈ సర్వే జరగగా, దేశంలోని చాలాచోట్ల ఆంక్షల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని, దీనివల్ల తమ ముడి సరుకుల ఖర్చు పెరిగిపోతున్నదని 73 శాతం వ్యాపారులు ఇందులో ఆందోళన వ్యక్తం చేశారు. డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేక మార్కెట్నూ కోల్పోతున్నామని చెప్పారు.
పెట్టుబడుల కొరత
మూలధనం లేక సంస్థాగత నిర్వహణ కష్టంగా మారుతున్నదని వ్యాపారులు చెప్తున్నారు. పెట్టుబడుల కొరతతో సంస్థ ఆదాయం, లాభాలు ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు. చాలా కంపెనీలు అమ్మకాలు లేక పూర్తి స్థాయిలో సిబ్బందిని కొనసాగించలేని దుస్థితికి చేరుకున్నట్లు తాజా సర్వే స్పష్టం చేసింది. కూలీ, జీతాలు భారంగా మారడమేగాక, రుణాలను తిరిగి చెల్లించలేని ఆర్థిక సమస్యల్లో పరిశ్రమ కూరుకుపోతున్నదని చెప్పింది.
ఉద్దీపన కావాల్సిందే
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పరిశ్రమ మనుగడ కోసం కేంద్ర ప్రభుత్వం ఓ భారీ ఉద్దీపన ప్రకటించాల్సిందేనని, లేకపోతే దేశ జీడీపీ మరింత దిగజారే ప్రమాదం ఉందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు సంజయ్ అగర్వాల్ అన్నారు. లాక్డౌన్లతో కార్యాలయాలు, దుకాణాలు మూతబడి ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడిందన్నారు. ముఖ్యంగా సరఫరా వ్యవస్థలో ఆటంకాలు.. ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని హెచ్చరించారు.