కరీంనగర్ : జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ఆర్య వైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితి అందరికి తెలుసన్నారు. ఆర్య వైశ్యుల కులస్థులను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే పరిగనించాయన్నారు. అటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్య వైశ్యులకు రాజకీయంగా గొప్ప అవకాశం ఇచ్చి ప్రోత్సహించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు మిల్లులు అమ్ముకునే పరిస్థితి, అప్పులు కట్టలేని పరిస్థితి ఉండేదన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ 2014-15 లో 25 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా 2020-21లో కోటి 40 లక్షల టన్నులు సేకరించిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ధాన్యం కేటాయింపు కోసం మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాలి. తెలంగాణలో మాత్రం అసోసియేషన్ లేఖ ఇస్తే సరిపోతుందన్నారు.
పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా వల్ల జనరేటర్లపై ఆధారపడడం పూర్తిగా తగ్గిందన్నారు. మన తెలంగాణలో వ్యాపారవేత్తలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి వేధింపులు లేవన్నారు. ఆహారశుద్ధి జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం వ్యాపారులను ప్రోత్సహిస్తున్నదన్నారు. భవిష్యత్తులో ఇవి పెద్ద ఎత్తున రానున్నట్లు తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసిందో ఒకసారి ఆలోచించాలని కోరారు. ఈ ఉప ఎన్నికకు కారణం ఎవరో అందరికీ తెలుసన్నారు. హుజురాబాద్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు బీజేపీ ఇంకో వైపు అన్నారు. బీజేపీ ఎన్నికలు వస్తే పాకిస్తాన్ గురించి మాట్లాడుతది లేదంటే సరిహద్దుల గురించి మాట్లాడుతుందని పేర్కొన్నారు.