జగిత్యాల, జూలై 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పథకాలు భేష్ అంటూ అవార్డులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టానికి ఒక్క పైసా ఇవ్వట్లేదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలోని హబ్సీపూర్లో ఆయన సోమవారం రాత్రి పల్లెనిద్ర చేశారు. మంగళవారం ఉదయం జగిత్యాల ఎమ్మెల్యేతో కలిసి గ్రామంలో పర్యటించారు. అనంతరం జిల్లాలోని పలు గ్రామాల్లో ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ర్టాల్లో ఆసరా పెన్షన్లు రూ.500 ఇస్తుంటే తెలంగాణలో నెలకు 2 వేలు ఇస్తున్నామని, 57 ఏళ్లు నిండిన వారికి సైతం పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టంచేశారు. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలను సమగ్రాభివృద్ధి చేసే గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.10 వేల కోట్లను మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. పల్లెప్రగతి కార్యక్రమం దేశానికి రోల్ మోడల్ అని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.