జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాద ఘటన చాలా బాధాకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula ) ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో తిరుపతి అనే వ్యక్తితోపాటు ఆయన ఇద్దరు పిల్లలు మృతిచెందారు. తిరుపతి భార్య మనోజ, కొడుకు ఆదిత్య తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి కొప్పుల స్పందించి మనోజను మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు, ఆమె కొడుకును కరీంనగర్ ఆస్పత్రికి పంపించారు.
ఇవాళ నిమ్స్ ఆస్పత్రిలో మనోజను పరామర్శించేందుకు మంత్రి వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటంతో కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రమాదం గురించి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన శస్త్రచికిత్సలు చేయాలని వారికి సూచించారు.