కరీంనగర్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఎంతో గౌరవం ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాజేందర్ పార్టీలో కీలకమైన పదవులతో పాటు రెండుసార్లు మంత్రిగా చేశారని గుర్తు చేశారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ నేతలతో కలిసి మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడారు.
‘సీఎం కేసీఆర్..ఈటలను ఎన్నోసార్లు ఎంతో గొప్పగా అభినందించారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లు ఆయన మాటల్లో ఎక్కడా కనబడటం లేదు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను సమావేశంలో అంగీకరించి బయటకు రాగానే వ్యతిరేకంగా మాట్లాడం సరైనదేనా. కేబినెట్ నిర్ణయాలు నచ్చకపోతే సమావేశంలోనే నోట్ చేయొచ్చు. అంతగా నచ్చకపోతే రాజీనామా చేయాల్సి ఉండే. ప్రభుత్వ విధానాలు, పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినట్లు కాదా. ఐదేళ్ల నుంచి ఈటల అసంతృప్తిగా పార్టీలో ఎందుకు ఉన్నారు. టీఆర్ఎస్లో ఈటల ఏనాడూ అవమానాలు ఎదుర్కోలేదు. ఐదేళ్ల నుంచి ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా. ఎక్కువ భూములు ఉన్నవారు రైతుబంధును తిరిగి ఇచ్చారు. ఈటల కుటుంబం ప్రతీ ఏడాది రూ.3.52లక్షల రైతుబంధు సొమ్ము తీసుకుంటున్నదని’ మంత్రి పేర్కొన్నారు.
‘మీ సొంత లబ్ధి, ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారు. మీ భావజాలంతో నిలబడితే ప్రజలు గౌరవిస్తారు. ఇతర పార్టీల చెంత చేరినప్పుడే మీ ఆత్మగౌరవం పోయింది. రాజేందర్ బీజేపీలో చేరేందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఆత్మ రక్షణ లేదా ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరుతున్నారు. ఏ ప్రాతిపదికన బీజేపీలో చేరుతున్నారో ఈటల చెప్పాలి. ఢిల్లీ వెళ్లినా అమిత్షా అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ విషయాన్ని ఏవిధంగా భావించాలి..ఇది ఆత్మవంచన కాదా?’ అని కొప్పుల విమర్శించారు.