హైదరాబాద్, మార్చి23 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల: సీఎం కేసీఆర్ ప్రకటించిన పంట నష్టపరిహారంపై తీవ్రవ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే సీఎంతో పాటు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోళి గ్రా మంలో గురువారం మంత్రి మాట్లాడారు. వండగండ్ల బాధితులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.10 వేలు ఏ మూలకు సరిపోవన్న బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన మతిభ్రమించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
వడగండ్ల బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం కేసీఆర్ స్వయంగా బాధిత రైతులను పరమర్శించడమే గాకుండా ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అం డగా ఉంటుందని, విపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు హితవు పలికారు. దేశంలోని 18 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఏరాష్ట్రంలోనైనా పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా ఎకరాకు రూ.10 వేలు ఇచ్చిందా అని ప్రశ్నించారు. పంటనష్టం వివరాలను ఇచ్చినా పట్టించుకోలేదని, గతంలో రూపాయి పరిహారం ఇవ్వలేదని, కేంద్రంలోని బీజేపీ కేవలం రాజకీయం చేస్తున్నదని ధ్వజమెత్తారు.