వెల్గటూర్, సెప్టెంబర్ 18: దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు పథకం చరిత్రాత్మకమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళితులను ధనవంతుల్ని చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారని కొనియాడారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం అంబారిపేటలో జిల్లా ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 90 రోజులపాటు శిక్షణ తీసుకున్న 42 మంది దళిత మహిళలకు శనివారం సర్టిఫికెట్లతోపాటు కుట్టుమెషిన్లు అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ వారం రోజుల్లో రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి ప్రకటించారు. దళితుల కోసం వ్యక్తిగతంగా, యూనిట్గా ప్రయోజనం కల్పించేందుకు సీఎం కేసీఆర్ 49 రకాల పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.